శ్రీను వైట్ల ఏం మారలేదు

ఒకప్పుడు టాలీవుడ్లో వైభవం చూసిన దర్శకుడు శ్రీను వైట్ల. ఒక దశలో రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌ల తర్వాత ఆయనకే ఎక్కువ డిమాండ్ ఉండేది ఆయనకు. రాజమౌళిని పక్కన పెడితే సక్సెస్ పరంగా మిగతా స్టార్ డైరెక్టర్లకు దీటుగా ఉండేవాడు వైట్ల. ఐతే చిన్న, మిడ్ రేంజ్ సినిమాలతో మొదలుపెట్టి పెద్ద రేంజికి వెళ్లిన వైట్ల.. ఆ తర్వాత అక్కడి నుంచి దిగి రాలేకపోయాడు. ఫెయిల్యూర్లు మొదలయ్యాక కూడా  భారీ చిత్రాలే తీస్తూ వచ్చాడు. తన సినిమా అంటే భారీ బడ్జెట్, సెటప్ ఉండాల్సిందే అన్నట్లు తయారైంది.

కాబట్టే ఆగడు, బ్రూస్ లీ లాంటి డిజాస్టర్ల తర్వాత కూడా.. వరుణ్ తేజ్ లాంటి అప్‌కమింగ్ హీరోతో ‘మిస్టర్’, రవితేజ లాంటి మిడ్ రేంజ్ స్టార్‌తో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పెద్ద బడ్జెట్లలోనే చేశాడు. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఆ చిత్రాలు దారుణమైన నష్టాలతో నిర్మాతల కొంప ముంచాయి. ఈ దెబ్బతో వైట్లకు సినిమా ఇవ్వడానికే నిర్మాతలు భయపడ్డారు. దీంతో నాలుగేళ్లకు పైగా ఖాళీగా ఉండపోయాడు వైట్ల. చివరికి ఫెయిల్యూర్లలో ఉన్న మంచు విష్ణు కూడా వైట్లతో సినిమా ఓకే చేసినట్లే చేసి వెనుకంజ వేశాడు.

చివరికి గోపీచంద్ హీరోగా చిత్రాలయం మూవీస్ అనే కొత్త బేనర్ వైట్లతో సినిమా చేయడానికి ముందుకొచ్చింది. ఆ సినిమా ఈ మధ్యే అనౌన్స్ అయింది. ఐతే విష్ణుతో సినిమా కూడా ఇలాగే అనౌన్స్‌మెంట్ తర్వాత వెనక్కి వెళ్లిపోయిన నేపథ్యంలో ఈ సినిమా అయినా ముందుకు కదులుతుందా లేదా అన్న డౌట్లు కొట్టాయి. కానీ ఆ సందేహాలకు తెరదించుతూ ఈ సినిమా తొలి షెడ్యూల్ మొదలైంది. కాకపోతే షూట్ మొదలైంది ఇక్కడ కాదు. యూరప్‌లోని మిలాన్‌లో. స్వయంగా ఈ మేరకు వైట్ల అప్‌డేట్ ఇచ్చాడు.

మిలాన్‌లోని ఒక భారీ లొకేషన్లో సీన్ పేపర్ చూస్తూ కనిపించాడు వైట్ల. ఐతే ఈ వీడియో చూసిన వాళ్లంతా వైట్ల గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వలేదని.. అతనేమీ మారలేదని కామెంట్ చేస్తున్నారు. వైట్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఫారిన్ లొకేషన్లు, భారీతనం మీద ఫోకస్ చేయకుండా.. కంటెంట్ మీద దృష్టిపెట్టి లిమిటెడ్ బడ్జెట్లో సినిమా తీసి దాన్ని సక్సెస్ చేయడం చాలా అవసరం. అది వదిలేసి తాను వైభవం చూసిన రోజుల్లో మాదిరే భారీతనానికి పెద్ద పీట వేసేట్లు కనిపిస్తోంది. గోపీచంద్ సైతం వరుస ఫెయిల్యూర్లలో మార్కెట్ కోల్పోయాడు. ఈ నేపథ్యంలో నిర్మాతలకు రిస్క్ తప్పేలా లేదు.