VD 12 సీక్వెల్ ఉంది కానీ షరతులు వర్తిస్తాయి

ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తోంది. కథలో ఏ మాత్రం స్కోప్ ఉన్నా చాలు ప్యాన్ ఇండియా సినిమాలని రెండు భాగాలుగా చేసుకుని డబుల్ బిజినెస్ చేసే పనిలో పడ్డారు నిర్మాతలు. బాహుబలి, కెజిఎఫ్, పుష్పల తర్వాత ఇప్పుడా మార్గాన్ని దేవర, సలార్, ప్రాజెక్ట్ కె వగైరాలు ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న స్పై కం యాక్షన్ థ్రిల్లర్ కూడా రెండు భాగాలుగా వస్తుందనే ప్రచారం ఈ మధ్య ఊపందుకుంది. వంద కోట్ల బడ్జెట్ అవ్వొచ్చని నిర్మాత నాగవంశీ అన్న మాటలు అభిమానులకు ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఇచ్చాయి.

దీనికి సంబంధించిన క్లారిటీ ఆయనే ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విడి 12లో చాలా టెర్రిఫిక్ యాక్షన్ ఉంటుందని, ఊహించని విధంగా ఫ్యామిలీ యాంగిల్ కూడా పెట్టామని, కానీ ప్రస్తుతానికి ఒక భాగంగానే తీసి క్లైమాక్స్ లో ఇచ్చే ఓపెన్ ఎండింగ్ కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి సినిమా ఫలితం చూశాక అప్పుడు నిర్ణయం తీసుకుంటామని తేల్చేశారు. అంటే బ్లాక్ బస్టర్ అయితే ఒకలా ఏదైనా కొంచెం అటుఇటు అయితే మరోలా రెండు ప్లాన్లు సిద్ధం చేసుకున్నారన్న మాట. ఇది మంచి ఆలోచన. రిజల్ట్ ని ముందే ఊహించలేం కాబట్టి ఇలా సెట్ చేసుకోవడం అవసరమే.

ప్రస్తుతం పరశురామ్ పేట్ల ఫ్యామిలీ స్టార్(ప్రచారంలో ఉన్న టైటిల్) కోసం గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళలేదు. అది సంక్రాంతిని లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి త్వరగా పూర్తి చేసే ఉద్దేశంతో నిర్మాత దిల్ రాజు పరుగులు పెట్టిస్తున్నారు. మళ్ళీ రావా, జెర్సీ లాంటి హై ఎమోషనల్ మూవీస్ తో పేరు తెచ్చుకున్న గౌతమ్ ఈసారి చాలా సీరియస్ జానర్ ఎంచుకున్నాడు. రామ్ చరణ్ తో సినిమా చేజారాక తాను ఏ జానర్ అయినా హ్యాండిల్ చేయగలనని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చి పడింది. సో కంటెంట్ ప్లస్ క్యాస్టింగ్ పరంగా చాలా సవాళ్లు ముందున్న విడి 12లో రౌడీ హీరో కొత్తగా కనిపించడం మాత్రం ఖాయం.