షూటింగుకు ముందే 95 కోట్ల ఆఫర్

మొన్నటి దాకా పెద్దగా ఎవరూ పట్టించుకోని బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీడియోల్ దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. మొహం చాటేసిన దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. అడ్వాన్సులు ఇచ్చేందుకు వెంటపడుతున్నారు. ఇదంతా గదర్ 2 మహత్యమే. అతి పెద్ద హిందీ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఈ క్లాసిక్ సీక్వెల్ తర్వాత సన్నీ చేయబోయే సినిమాల లిస్టు పెరుగుతోంది. అమీర్ ఖాన్ నిర్మాతగా రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో స్పెషల్ ఏమనేగా మీ డౌట్. అక్కడికే వద్దాం.

సన్నీ డియోల్, రాజ్ కుమార్ సంతోషి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. అవి దామిని, ఘాయల్, ఘాతక్. అన్నీ సూపర్ డూపర్ హిట్లే. 1996 తర్వాత మళ్ళీ ఈ కాంబో సాధ్యపడలేదు. ఏవో విబేధాల వల్ల తిరిగి కలుసుకునే ప్రయత్నాలు చేయలేదు. పాతికేళ్ల తర్వాత చేతులు కలపబోతున్నారు. టైటిల్ గా ‘జిస్నే లాహోర్ నహీ దేఖా’ని పరిశీలిస్తున్నారు. ఇది అస్గర్ వజాహట్ రాసిన నవల ఆధారంగా రూపొందనుంది. 1947 ఇండియా పాకిస్థాన్ విభజన టైంలో లక్నో నుంచి లాహోర్ వెళ్లిన శరణార్ధుల విషాద పరిణామాల చుట్టూ తిరిగే కథగా దీన్ని రాసుకున్నారట. ఇంచుమిందు గదర్ లైనే ఇది.

కాకపోతే కమర్షియల్ టచ్ కన్నా సీరియస్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ప్రాజెక్ట్ లాక్ చేసుకున్న వెంటనే జీ5 సంస్థ నుంచి 95 కోట్లకు ఓటిటి డీల్ వచ్చిందని ముంబై టాక్. అయితే ఇంకా మంచి రేట్ వస్తుందనే ఉద్దేశంతో అమీర్ ఖాన్ ఇంకా ఎస్ చెప్పలేదట. అసలు గదర్ 2 బడ్జెటే ఎనభై కోట్లు దాటలేదు. అలాంటిది ఇప్పుడు ఇంత మొత్తమంటే విశేషమే. వచ్చే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. సౌత్ లో కమల్ హాసన్, రజనీకాంత్ లు అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చినట్టు అక్కడ షారుఖ్ ఖాన్ తో పాటు సన్నీ డియోల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.