బ్లాక్‌బస్టర్ కాంబో.. డిజాస్టర్ ఇచ్చారు

తెలుగు వాడైన తమిళ కథానాయకుడు జయం రవి కెరీర్లో ఎప్పటికీ నంబర్ వన్ సినిమా ఏది అంటే ‘తనీ ఒరువన్’ అనే చెబుతారు. తన అన్నయ్య మోహన్ రాజా దర్శకత్వంలో రవి చేసిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇదే చిత్రం తెలుగులో ‘ధృవ’ పేరుతో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తే అదీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో జయం రవి పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇందులో నయనతార అతడికి జోడీగ నటించింది. ఆమెకు కూడా సినిమా మంచి పేరే తెచ్చింది. మామూలుగా ఒక స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ కలిసి చేసిన సినిమా బ్లాక్‌బస్టర్ అయితే.. వాళ్ల కాంబినేషన్‌ను వెంట వెంటనే రిపీట్ చేయాలని చూస్తారు. కానీ గత ఎనిమిదేళ్లలో వీరి కలయికలో మరో సినిమానే రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇద్దరూ కలిసి ‘ఇరవైన్’ అనే సినిమా చేశారు. ఈ గురువారమే మంచి అంచనాల మధ్య రిలీజైందీ సినిమా.

ఇదొక సైకో థ్రిల్లర్ కథతో తెరకెక్కిన సినిమా. విపరీతమైన వయొలెన్స్ ఉండటంతో ఈ సినిమాను చిన్న పిల్లలు చూడొద్దంటూ రవి అప్పీల్ కూడా ఇచ్చాడు. ఇలా అంటున్నాడంటే పెద్ద వాళ్లకు సినిమా బాగా నచ్చుతుందేమో.. థ్రిల్లర్ ప్రియులు ఉత్కంఠతో ఊగిపోతారేమో అనుకున్నారు. కానీ ‘ఇరవైన్’ ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఎన్నోసార్లు చూసిన సైకో థ్రిల్లర్ లాగే ఉండటం.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు లేకపోవడంతో దీనికి బ్యాడ్ రివ్యూలు వచ్చాయి.

నయనతార పాత్ర తేలిపోవడం.. జయం రవి కూడా అభిమానుల అంచనాలను అందుకోకపోవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర తీవ్ర ఇబ్బందికర పరిస్థితి చూస్తోంది. ‘చంద్రముఖి-2’ కూడా బ్యాడ్ రివ్యూలు తెచ్చుకున్నా సరే.. దానికే దీంతో పోలిస్తే మెరుగైన వసూళ్లు వచ్చాయి వీకెండ్లో. సిద్దార్థ్ మూవీ ‘చిత్తా’ ఈ వీకెండ్ విన్నర్ అయింది. ‘ఇరవైన్’కు తొలి వీకెండ్లోనే సరైన వసూళ్లు లేవు. తొలి రోజే ఇది డిజాస్టర్ అని తేలిపోయింది. ‘తనీ ఒరువన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవి-నయన్ కలయికలో ఇలాంటి సినిమా వస్తుందని ప్రేక్షకులు అస్సలు ఊహించలేదు.