సంక్రాంతికి ఎవరుంటారో.. ఎవరెళ్తారో?

సంక్రాంతికి మామూలుగా అయితే ఆర్నెల్ల ముందే బెర్తులు బుక్ అయిపోతుంటాయి. కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా మూణ్నాలుగు నెలల ముందే ఏ సినిమాలు వస్తాయో క్లారిటీ వచ్చేస్తుంది. కానీ వచ్చే సంక్రాంతి విషయంలో మాత్రం విపరీతమైన గందరగోళం నడుస్తోంది. ఎవరికి వాళ్లు రిలీజ్ డేట్లు ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. అనధికారికంగా డేట్లు ఫిక్స్ చేసుకుని సైలెంటుగా పని చేసుకునేవాళ్లు చేసుకుంటున్నారు.

కానీ ఆ టైంకి ఏ సినిమా రెడీ అవుతుందో.. ఎన్ని చిత్రాలకు అవకాశం ఉంటుందో.. ఏవి ఫైనల్‌గా బెర్తులను సొంతం చేసుకుంటాయో తెలియని అయోమయం నడుస్తోంది. కొన్ని నెలలుగా ఎప్పటికప్పుడు సంక్రాంతి రేసు మారుతూ వస్తోంది. ముందు అనుకున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పుడు సంక్రాంతికి రావని తేలిపోయింది.

అందరికంటే ముందు బెర్తు ఖరారు చేసుకున్న మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ ప్రస్తుతానికి సంక్రాంతికే ఫిక్స్ అయి ఉంది. కానీ షూటింగ్ చాలా పెండింగ్ ఉండటంతో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు రవితేజ సినిమా ‘ఈగల్’, ప్రశాంత్ వర్మ మూవీ ‘హనుమాన్’ సంక్రాంతికే కట్టుబడి ఉన్నాయి. ఐతే కొత్తగా నాగ్ మూవీ ‘నా సామిరంగ’ను రేసులోకి తెచ్చారు.

ఇప్పుడేమో ‘సలార్’ క్రిస్మస్‌కు రాబోతుందన్న వార్తల నేపథ్యంలో వెంకీ మూవీ ‘సైంధవ్’, నాని చిత్రం ‘హాయ్ నాన్న’ టీమ్స్ కూడా సంక్రాంతి వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే కనీసం అరడజను సినిమాలు సంక్రాంతికి షెడ్యూల్ అయినట్లు అవుతుంది. కానీ అన్ని సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడం అన్నది అసాధ్యమైన విషయం. మరి వీటిలో ఏది చివరి వరకు సంక్రాంతి రేసులో నిలిచి ఆ సీజన్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుంటుందో చూడాలి.