ఇండియా అధికారిక ఆస్కార్ ఎంట్రీ 2018

మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై అనూహ్య విజయం సాధించి రికార్డులు సృష్టించిన 2018 ఎవరీవన్ ఈజ్ ఏ హీరోకు అరుదైన గౌరవం దక్కింది. భారతదేశం తరఫున బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ విభాగంలో అఫీషియల్ నామినేషన్ గా పంపబోతున్నట్టు ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా ప్రెసిడెంట్ టిపి అగర్వాల్ వెల్లడించడంతో మల్లు వుడ్ ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. దీని తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని బన్నీ వాస్ అందించగా ఏపీ తెలంగాణలో మంచి వసూళ్ళతో హిట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీగా అడుగు ముందుకు వేయడం మూవీ లవర్స్ కి సంతోషమే.

తెలుగు నుంచి దసరా, బలగం లాంటి సినిమాలు వెళ్లినప్పటికీ 2018 వాటిని ఓవర్ టేక్ చేసింది. ఆరేళ్ళ క్రితం కేరళను ముంచెత్తిన వరదలను ఆధారంగా చేసుకుని దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్ చూపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా కమర్షియల్ అంశాలకు తావు లేకుండా వరదలు విపత్తులు వచ్చినప్పుడు మానవ సంబంధాలు ఎలా ఉండాలి, ఒకరికొకరు అండగా ఎలా నిలవాలనే విషయాలను హృదయాలను కదిలించే రేంజ్ లో తీశారు. ప్రకృతి విపత్తుల మీద వచ్చిన ఇండియన్ సినిమాల్లో పెద్ద విజయం సాధించినవాటిలో 2018దే ప్రధమ స్థానం

అధికారికంగా ఎంట్రీ పంపినంత మాత్రాన అవార్డు వచ్చేయదు. దీనికి బోలెడు కసరత్తు జరగాలి. ఆర్ఆర్ఆర్ లో నాటునాటుకి పురస్కారం దక్కేదాకా రాజమౌళి బృందం పడిన కష్టం అంతా ఇంతా కాదు. క్యాంపైన్లు, ప్రీమియర్లు, సెలబ్రిటీ షోలు, ఫారిన్ టూర్లు వగైరాలు ఎన్నో ప్లాన్ చేసుకోవాలి. ఇవేవి లేకుండానే ఆస్కార్ రావాలంటే జ్యురీ సభ్యులకు మన చిత్రం ఎక్స్ ట్రాడినరీ అనిపించాలి. 2018 తరహాలో మూవీస్ హాలీవుడ్ లో ఎన్నో వచ్చాయి కాబట్టి కొత్తగా అనిపించకపోవచ్చు కానీ దీంట్లో చూపించిన ఎమోషన్స్ కనక కనెక్ట్ అయితే మాత్రం సానుకూల ఫలితం వచ్చే ఛాన్స్ లేకపోలేదు.