కంగ‌నా పోకిరి చేయాల్సింది కానీ..

బాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఎదిగిన కంగ‌నా ర‌నౌత్‌.. టాలీవుడ్లోనూ ఒక పెద్ద సినిమాలో క‌థానాయిక‌గా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న చేసిన ఆ చిత్ర‌మే ఏక్ నిరంజ‌న్. ఐతే అందులో ఆమె పాత్ర పెద్ద‌గా క్లిక్ కాలేదు. సినిమా కూడా అనుకున్నంత‌గా ఆడ‌లేదు. దీంతో కంగ‌నా మ‌ళ్లీ టాలీవుడ్‌లో క‌నిపించ‌లేదు. ఆ త‌ర్వాత బాలీవుడ్లో ఆమె పెద్ద రేంజికి వెళ్లింది.

నిజానికి ఏక్ నిరంజ‌న్ కంటే ముందు పూరి తీసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ పోకిరిలో ఆమె క‌థానాయిక‌గా చేయాల్సింద‌ట‌. కానీ అనివార్య కార‌ణాల‌తో ఆ సినిమాను త‌నే వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని కంగ‌నా ర‌నౌత్ చంద్ర‌ముఖి-2 ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. పూరి స‌ర్ నాకెంతో న‌చ్చిన డైరెక్ట‌ర్. అస‌లు నా ప్ర‌తిభ‌ను గుర్తించిందే ఆయ‌న‌.

కెరీర్ ఆరంభంలోనే న‌న్ను చూసి పెద్ద స్టార్ అవుతాన‌ని అంచ‌నా వేశారు. మ‌హేష్ బాబుతో పోకిరి సినిమాకు ఆయ‌న న‌న్నే క‌థానాయికగా ఎంచుకున్నారు. ఐతే అదే స‌మ‌యంలో నాకు గ్యాంగ్‌స్ట‌ర్ మూవీలో ఆఫ‌ర్ వ‌చ్చింది. స‌రిగ్గా అక్టోబ‌రులో రెండు సినిమాల‌కూ డేట్లు అవ‌స‌రం అయ్యాయి. నేను గ్యాంగ్‌స్ట‌ర్ మూవీనే ఎంచుకున్నాను.

పోకిరి సినిమాను వ‌దులుకున్నందుకు బాధ అనిపిస్తుంటుంది అని కంగ‌నా వెల్ల‌డించింది. పోకిరి మిస్ అయిన‌ప్ప‌టికీ పూరితో ఏక్ నిరంజ‌న్ చేశాన‌ని.. అది త‌న‌కు ఆనందాన్నిచ్చే విష‌య‌మ‌ని ఆమె అంది. చంద్ర‌ముఖి సీక్వెల్లో ఛాన్స్ రావ‌డం ప‌ట్ల చాలా ఎగ్జైట్ అయ్యాన‌ని.. ఆ సినిమా క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని.. తెలుగులోనూ ఈ సినిమా బాగా ఆడుతుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేసింది. త‌మిళంలో దీనికంటే ముందు ఆమె చేసిన త‌లైవి డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే.