‘వ్యాక్సిన్ వార్’పై నమ్మకం లేదా?

వివేక్ రంజన్ అగ్నిహోత్రి.. గత ఏడాది ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో మార్మోగిన పేరిది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో ఆ సినిమా తీస్తే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ సినిమాకు చాలామంది ఎమోషనల్‌గా కనెక్ట్ అయి పెద్ద హిట్ చేశారు. ‘కశ్మీర్ ఫైల్స్’ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మద్దతుదారులు తమ భుజాల మీద మోసిన మాట వాస్తవం. ఆ తర్వాత వివేక్ తీసిన సినిమానే.. వ్యాక్సిన్ వార్. ముందు ఈ టైటిల్ చూసి కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో జరిగిన కుట్రలు.. కంపెనీల మధ్య పోటీ మీద ఉత్కంఠభరిత థ్రిల్లర్ తీస్తారని అనుకున్నారు.

కానీ వివేక్ ఏమో.. వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు చేసిన పోరాటం మీద సినిమా తీశాడు. ట్రైలర్ చూస్తే మరీ ఎగ్జైటింగ్‌గా ఏమీ కనిపించలేదు. ఈ నెల 28న ఈ చిత్రం వివిధ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఐతే విడుదల ముంగిట ఆశించిన బజ్ కనిపించకపోయేసరికి వివేక్ సింపతీ వర్కవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

తన సినిమాకు దెబ్బ కొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. ఈ సినిమా ఆడకపోతే తన పరిస్థితి ఇబ్బందికరంగా తయారవుతుందని అతను వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ‘‘వ్యాక్సిన్ వార్ మీద చిత్ర పరిశ్రమ నిషేధం విధించినట్లుంది. అందుకే ఎవ్వరూ ఈ సినిమా గురించి మాట్లాడట్లేదు. నా సినిమా మీద రివ్యూలు రాకుండా ఉండేందుకు చాలామందికి డబ్బులు ఇస్తున్నారు. నేను బాక్సాఫీస్ నంబర్ల కోసం పరుగులు పెట్టే రకం కాదు. కశ్మీర్ ఫైల్స్ విజయం సాధించాక దానికి సీక్వెల్ తీయాలని కొన్ని సంస్థలు నన్ను సంప్రదించాయి.

రూ.300 కోట్ల దాకా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ నేను వాళ్ల ట్రాప్‌లో పడలేదు. కరోనా సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు పడ్డ కష్టాన్ని ప్రేక్షకులకు చూపించాలనుకున్నా. అందుకే తక్కువ బడ్జెట్లో ‘వ్యాక్సిన్ వార్’ చేశా. ఈ చిత్రానికి సరైన ఆదరణ దక్కకపోతే నా పరిస్థితి గతంలో లాగా తయారవుతుంది’’ అని వివేక్ అన్నాడు. వివేక్ మాటలు చూస్తుంటే ‘వ్యాక్సిన్ వార్’ మీద అపనమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తోంది.