ప్రభాస్ శివుడు నయనతార పార్వతి

మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తూ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న భక్త కన్నప్పలో ప్రభాస్ ఉన్నాడనే వార్త పది రోజుల క్రితం సోషల్ మీడియాని ఊపేసిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా ఈ ప్రాజెక్టు మీద అంతగా దృష్టి పెట్టని నేషనల్ మీడియా దీని దెబ్బకు ఒక్కసారిగా కవరేజ్ ఇచ్చేసింది. ఇటీవలే హీరోయిన్ నుపుర్ సనన్ ఇందులో నుంచి తప్పుకోవడం చర్చకు దారి తీసినా కేవలం డేట్ల సమస్య వల్లే ఈ నిర్ణయం జరిగిందని విష్ణు క్లారిటీ ఇచ్చాడు. ఇక లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే ప్రభాస్ మహాశివుడిగా నటిస్తే ఆయన పక్కన పార్వతిగా నయనతారను లాక్ చేయబోతున్నారని తెలిసింది.

స్క్రీన్ మీద ఈ ఇద్దరి కాంబో పద్దెనిమిదేళ్ల వెనుక జరిగింది. యోగి ఆశించిన ఫలితం అందుకోలేదు కానీ డార్లింగ్ ప్లస్ నయన్ కెమిస్ట్రీని ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. మళ్ళీ ఇంత కాలం తర్వాత అది కూడా ఒక స్పిరిచువల్ మూవీ దాకా కలిసుకోవడమంటే మాటలు కాదు. ప్రాథమికంగా చర్చలు జరిగాయని, నయన్ ఆల్మోస్ట్ ఓకే చెప్పినట్టేనని చెన్నై టాక్. శ్రీరామరాజ్యంలో సీతగా మెప్పించిన ఈ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కి పార్వతి వేషం కూడా నప్పుతుంది. ఆ మధ్య గ్రామ దేవత బ్యాక్ డ్రాప్ లో అమ్మోరు తల్లి చేస్తే ఓటిటిలో మంచి పేరు వచ్చింది. సో గెటప్ గురించి అనుమానం అక్కర్లేదు.

ఇవేవి టీమ్ అఫీషియల్ గా ప్రకటించడం లేదు. లీకుల రూపంలోనే బయటికి వస్తున్నాయి. ఇతిహాసగాథ సీరియళ్లను అద్భుతంగా డీల్ చేశాడని పేరున్న దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. క్యాస్టింగ్ ఇంకా ఫైనల్ చేయలేదు. ఎంపిక పూర్తయ్యాక తారాగణం మొత్తం ఒకేసారి విదేశాలకు బయలుదేరుతుంది. అక్కడ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాక మిగిలిన భాగం ఇక్కడ కొనసాగిస్తారు. కాకపోతే బల్క్ డేట్స్ ఇచ్చే ఆర్టిస్టులే అవసరం ఉండటంతో కాంబోలు సెట్ చేయడానికి కొంత ఆలస్యమవుతోందని ఇన్ సైడ్ టాక్.