గ‌ద‌ర్ 2, జ‌వాన్ సిల్లీ సినిమాల‌ట‌

ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే అత్యంత గొప్ప న‌టుల్లో నానా ప‌టేక‌ర్ ఒక‌రు. తెర మీద ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు పోషించిన నానా.. బ‌య‌ట వ్య‌వ‌హ‌రించే, మాట్లాడే తీరు కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది. చాలా వ‌ర‌కు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు ఆయ‌న మాట్లాడేస్తుంటారు. తాజాగా ఆయ‌న బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ గురించి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.

గ‌ద‌ర్-2, జ‌వాన్ సిల్లీ సినిమాల‌ని.. అలాంటి సినిమాలు చూసి తీరాల్సిన ప‌రిస్థితిని ప్రేక్ష‌కుల‌కు క‌ల్పిస్తున్నార‌ని నానా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. గ‌ద‌ర్-2 సినిమా ఇండియాలో ఏకంగా రూ.500 కోట్ల‌కు పైగా నెట్ వ‌సూళ్లు సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా గురించి ఆయ‌న మాట్లాడుతూ.. ఈ సినిమా థియేట‌ర్లో తాను ఎక్కువ‌సేపు కూర్చోలేక‌పోయాన‌ని.. మ‌ధ్య‌లోనే వ‌చ్చేశాన‌ని పేర్కొన్నారు.

అలాగే జ‌వాన్ కూడా సిల్లీ సినిమా అన్న‌ట్లు ఆయ‌న మాట్లాడారు. ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమాలు చూసే అవ‌కాశం రావ‌ట్లేద‌ని.. దీంతో ఇలాంటి సినిమాలను ఆద‌రించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌స్తోంద‌ని ఆయ‌న‌న్నారు. నానా ప‌టేక‌ర్ ప్ర‌స్తుతం వాక్సిన్ వార్ మూవీలో న‌టించారు. క‌శ్మీర్ ఫైల్స్ త‌ర్వాత వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి నుంచి వ‌స్తున్న సినిమా ఇది. ఇందులో ఒక సైంటిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు నానా.

ఐతే క‌శ్మీర్ ఫైల్స్ లాగే ఇది కూడా ప్రాప‌గండా మూవీ అనే చ‌ర్చ న‌డుస్తోంది. వివేక్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా తీస్తార‌నే ముద్ర ఉంది. ఇలాంటి సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన నానా.. జ‌వాన్, గ‌ద‌ర్-2 లాంటి సినిమాలను ఇలా త‌క్కువ చేసి మాట్లాడటం ఏంట‌నే ప్ర‌శ్న‌లు నెటిజ‌న్ల నుంచి త‌లెత్తుతున్నాయి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చూసే ప్రేక్ష‌కుల అభిరుచిని ఆయ‌న త‌ప్పుబ‌డుతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.