సినిమా పోయినా.. విజ‌య్ మాట నిలిచింది

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల ఖుషి సినిమా స‌క్సెస్ మీట్‌లో చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం రేపింది. ఇప్ప‌టిదాకా ఎన్న‌డూ లేని విధంగా అభిమానుల‌కు త‌న ఆదాయం నుంచి వాటా ఇవ్వాల‌ని విజ‌య్ నిర్ణ‌యించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఖుషి సినిమాకు గాను తాను అందుకున్న రెమ్యూన‌రేష‌న్ నుంచి వంద మంది అభిమానుల కుటుంబాల‌కు రూ.ల‌క్ష చొప్పున మొత్తంగా కోటి రూపాయ‌లు ఇవ్వ‌నున్న‌ట్లు విజ‌య్ ప్ర‌క‌టించాడు.

ప్రేక్ష‌కుల అభిమానానిని క్యాష్ చేసుకునేవాళ్లే కానీ.. వాళ్ల‌కు ఇలా ఆదాయంలో వాటా ఇవ్వ‌డం ఇంత‌వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. ఐతే దీని మీద కూడా కౌంట‌ర్లు వేసిన వాళ్లు లేక‌పోలేదు. ఖుషి సినిమా వీకెండ్ త‌ర్వాత డ‌ల్ అయిన నేప‌థ్యంలో ప‌బ్లిసిటీ కోసం విజ‌య్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడ‌ని.. నిజంగా అత‌ను అభిమానుల‌కు సాయం చేస్తాడా, దీన్ని ఎవ‌రు ఫాలో అప్ చేస్తారు, వెరిఫై చేస్తారు అని ర‌క‌ర‌కాలుగా మాట్లాడారు ఆ జ‌నం. 

కానీ విజ‌య్ మాత్రం మాట నిల‌బెట్టుకున్నాడు. కొన్ని రోజుల కింద‌టే ఈ సాయం పొందేందుకు ఒక ఫామ్ షేర్ చేసిన విజ‌య్.. తన టీంతో క‌లిసి సాయం అవ‌స‌ర‌మైన వారిని ఎంపిక చేశాడు. తాను ఎవ‌రికి సాయం చేస్తున్నానో ఆ వంద మంది అభిమానుల జాబితాను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

అంతే కాక ఒక ఈవెంట్ కూడా ఏర్పాటు చేసి చెప్పిన‌ట్లే అభిమానుల‌కు సాయాన్ని అంద‌జేశాడు. నిజానికి తొలి వీకెండ్ త‌ర్వాత ఖుషి వ‌సూళ్లు ఒక్క‌సారిగా ప‌డిపోయాయి. విజ‌య్ స్టేట్మెంట్ సినిమా ప్ర‌మోష‌న్ల‌కేమీ ఉప‌క‌రించ‌లేదు. ఒక్క యుఎస్‌లో త‌ప్ప తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వ‌లేదు. అయినా స‌రే.. విజ‌య్ అదేమీ ప‌ట్టించుకోకుండా చెప్పిన‌ట్లే అభిమానుల‌కు కోటి రూపాయ‌ల సాయం అందించి మాట నిల‌బెట్టుకుని శ‌భాష్ అనిపించుకున్నాడు.