దర్శకుడి మీద కోపం తగ్గలేదన్న విశాల్

హీరో దర్శకుల మధ్య విభేదాలు రావడం సహజమే కానీ అవి మరీ మితిమీరిపోయి మీడియాకు ఎక్కేంత స్థాయిలో ఉండవు. అనవసరంగా పేరు పోతుందని ఎవరికి వారు గుంభనంగా ఉంటారు. కానీ విశాల్ కు మాత్రం అలా సాధ్యపడలేదు. తుప్పరివాలన్ (తెలుగులో డిటెక్టివ్) దర్శకుడు మిస్కిన్ తో తనకు తీవ్ర అభిప్రాయ బేధాలున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ సందర్భంగా విశాల్ మీద మిస్కిన్  తీవ్రంగా నోరు పారేసుకోవడంతో వివాదం మొదలైంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఏకంగా ఆ ప్రాజెక్ట్ రెండేళ్లు పెండింగ్ లో పెట్టేసి కొంత భాగం షూట్ అయ్యాక ఆపేశారు.

మార్క్ ఆంటోనీ ప్రమోషన్లలో భాగంగా ఈ ప్రస్తావన వచ్చినప్పుడు విశాల్ మరింత క్లారిటీ ఇచ్చాడు. మిస్కిన్ వల్ల లండన్ ప్లాట్ ఫార్మ్ మీద ఒక్కడినే నరకం చూడాల్సి వచ్చిందని, అలాంటి వ్యక్తితో మళ్ళీ పని చేసే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పాడు. డిటెక్టివ్ 2 ఎంత ఆలస్యమైనా తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తాను తప్పించి ఇంకెవరికీ అప్పగించే ప్రసక్తే లేదని ఘాటుగా బదులిచ్చాడు. 2017లో వచ్చిన ఆ క్రైమ్ థ్రిల్లర్ తమిళ తెలుగులో మంచి విజయం సాధించింది. అప్పటినుంచే దానికి కొనసాగింపు ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమయింది కానీ బాగా లేట్ చేశారు.

ఇంటెన్స్ టేకింగ్ తో క్రైమ్ ని బాగా చూపిస్తాడని పేరున్న మిస్కిన్ ఈ మధ్య నటుడిగానే బిజీ అవుతున్నారు. శివ కార్తికేయన్ మహావీరుడులో మెయిన్ విలన్ గా నటించింది ఈయనే. విశాల్ తో తనకు అపార్థాలు వచ్చాయని, అవి త్వరలో సమిసిపోయి మంచి స్నేహితులు అవుతామని ఆగస్ట్ నెలలో ఇంకో సినిమా ఫంక్షన్లో చెప్పిన మిస్కిన్ మాటలకు భిన్నంగా విశాల్ ఇంకా జరిగింది మర్చిపోలేదని చెప్పడం గమనార్హం. ఈ వారం 15 విడుదల కాబోతున్న మార్క్ ఆంటోనీ మీద విశాల్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. బడ్జెట్ కూడా భారీగా ఖర్చు పెట్టి తీశారు. స్కంద, చంద్రముఖి 2 తప్పుకోవడం పెద్ద ప్లస్ కానుంది.