అనుష్క దర్శకుల కోసం స్పెషల్ ప్రీమియర్

రేపుకి విడుదల కాబోతున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మీద స్వీటీ ఫ్యాన్స్, నవీన్ పోలిశెట్టి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య ట్రెండ్ గా మారిన ముందు రోజు ప్రీమియర్లకు యువి క్రియేషన్స్ మొగ్గు చూపకపోవడంతో మూవీ లవర్స్ కొంత నిరాశ చెందినా డిఫరెంట్ గా అనిపించే ఈ ఫ్రెష్ జంటను చూసేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండకా ఇక్కడ స్పెషల్ షోలు లేవు కానీ చెన్నైలో అనుష్కతో వర్క్ చేసిన దర్శకులతో పాటు కోలీవుడ్ ప్రముఖులకు ఇవాళ సాయంత్రం ఎక్స్ క్లూజివ్ ప్రీమియర్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఆహ్వానితులకు మాత్రమే ఎంట్రీ.

దీనికి హాజరయ్యేవాళ్ళలో సుందర్ సి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హరి, ఏఎల్ విజయ్, సూరజ్, సెల్వ రాఘవన్, కెఎస్ రవికుమార్ తదితరులు హాజరు కాబోతున్నట్టు తెలిసింది. వీళ్ళతో పాటు పలువురు హీరోలు నిర్మాతలు అటెండ్ కాబోతున్నారు. ప్రత్యేకంగా చెన్నైలోనే ఎందుకంటే అక్కడి బిజినెస్ వర్గాల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మీద మంచి క్రేజ్ ఉందట. సింగం, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్స్ తో తమిళంలోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్న అనుష్కకు కంబ్యాక్ మూవీగా ప్రచారం జరగడంతో బిజినెస్ కూడా బాగానే జరిగిందని దర్శకుడు మహేష్ బాబు అంటున్నారు.

అదే తరహా ఇక్కడా ఒక షో ప్లాన్ చేస్తే బాగుండేది. జవాన్ పోటీని తట్టుకోవడం శెట్టి జంటకు అంత సులభంగా కనిపించడం లేదు. బుకింగ్స్ పరంగా రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అయితే టాక్ నే నమ్ముకున్న యువి సంస్థకు ఇది సక్సెస్ కావడం చాలా కీలకం. ప్రమోషన్స్ లో అనుష్క నేరుగా పాల్గొనకపోయినా రేపు సినిమా బాగుందనే రిపోర్ట్స్ వస్తే ప్రేక్షకులు అదేమీ పట్టించుకోకుండా థియేటర్లకు వస్తారనే నమ్మకం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ఇవాళ జరిగే ప్రీమియర్ నుంచి ఎలాగూ అభిప్రాయాలు బయటికి వస్తాయి. నవీన్ పోలిశెట్టి ఎనర్జీలాగా టాక్ పాజిటివ్ గా వస్తే చాలు.