శెట్టి జంట క్లాస్ VS జవాన్ మాస్

రేపు మరో ఆసక్తికరమైన బాక్సాఫీస్ క్లాష్ కి రంగం సిద్ధమయ్యింది. పేరుకు షారుఖ్ ఖాన్ జవాన్ డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ బుకింగ్స్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏదో పెద్ద స్టార్ హీరో అన్న రేంజ్ లో జరుగుతున్నాయి. చాలా చోట్ల ఉదయం ఏడు గంటలకే వేస్తున్న షోలు హౌస్ ఫుల్ కావడం బాద్షా క్రేజ్ కి నిదర్శనం. జనవరిలో వచ్చిన పఠాన్ కు హైప్ కనిపించింది కానీ ఇంత స్థాయిలో ఏపీ తెలంగాణ బిసి సెంటర్లలో లేదని బయ్యర్లు చెబుతున్నారు. దీన్ని బట్టే ట్రైలర్ కంటెంట్ ఏ రేంజ్ లో జనాలకు రీచ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మాస్ దీని మీద గట్టి నమ్మకం పెట్టుకున్నారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి ఇంత హంగామా లేకపోయినా కూల్ అండ్ స్టడీగా టాక్ తో నిలబడుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు. అనుష్క ప్రత్యక్షంగా రాకపోయినా నవీన్ పోలిశెట్టి అంతా తానై పబ్లిసిటీ భారం మొత్తం భుజాన వేసుకున్నాడు. ఒక స్టాండప్ కమెడియన్ కి, అతని కన్నా వయసులో కొంచెం పెద్దయిన లేడీ చెఫ్ కి మధ్య జరిగే వెరైటీ లవ్ స్టోరీగా దర్శకుడు మహేష్ బాబు దీన్ని తీర్చిదిద్దారు. వంటల ఛాలెంజ్ పేరుతో ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్లు ఆన్లైన్ క్యాంపైన్ లో భాగం కావడంతో ప్రమోషన్ పరంగా ఎంతో కొంత ఇది ఉపయోగపడుతోంది. స్వీటీ ఫోన్ ఇంటర్వ్యూలు ఇస్తోంది.

ఈ రెండు సినిమాలకు కలిసొస్తున్న మరో అంశం రెండో వారంలోకి అడుగు పెట్టకుండానే విజయ్ దేవరకొండ ఖుషి బాగా నెమ్మదించడం. మూడు రోజులు బాగానే రాబట్టినప్పటికీ హఠాత్తుగా సోమవారం నుంచి విపరీతమైన డ్రాప్ నమోదు చేయడం ఆందోళన కలిగించింది. అయితే జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలకున్న మరో ముప్పు వర్షాలు. నైజామ్ ని విపరీతమైన వణికిస్తున్న వర్షాలు అటు ఏపీలోనూ చలి వాతావరణాన్ని సృష్టించాయి. వీటి లెక్క చేయకుండా థియేటర్లకు రావాలంటే బ్రహ్మాండంగా ఉన్నాయనే టాక్ రావాలి. మరి స్వీటీ క్లాస్ వర్సెస్ జవాన్ మాస్ లో ఎవరు నెగ్గుతారో ఇంకో 24 గంటల్లో తేలిపోతుంది.