చంద్రముఖి మళ్లీ ట్రోల్ మెటీరియల్ కాబోతోందా?

చంద్రముఖి.. సౌత్ ఇండియన్ సినిమాల్లో హార్రర్ కామెడీ ఊపందుకోవడానికి దోహదపడ్డ చిత్రం. 1993లో వచ్చిన మలయాళ మూవీ ‘మణిచిత్ర తాళు’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఈ సినిమా మళ్లీ ఓ బ్లాక్‌బస్టర్ ఇచ్చి ఆయన కెరీర్ ఊపందుకునేలా చేసింది. దర్శకుడిగా అప్పటికే ఔట్ డేట్ కేటగిరీలో చేరిపోయిన పి.వాసు ఈ రీమేక్ మూవీతోనే మళ్లీ కెరీర్‌ను పొడిగించుకున్నాడు.

కానీ ఆయన ఆ తర్వాత తీసిన మహారథి, నాగవల్లి లాంటి సినిమాలు ఎంత ఘోరమైన ఫలితాన్ని అందుకున్నాయో తెలిసిందే. ముఖ్యంగా ‘చంద్రముఖి’ సీక్వెల్ అంటూ విక్టరీ వెంకటేష్‌తో వాసు తెలుగులో తీసిన ‘నాగవల్లి’ పెద్ద ట్రోల్ మెటీరియల్ లాగా మారింది. అందులో వెంకీ పాత్ర.. ఆయన గెటప్.. ఔర ఔర అనే మేనరిజం మామూలు విమర్శలకు గురి కాలేదు. అప్పటికి సోషల్ మీడియా ఊపు తక్కువగా ఉంది కానీ.. లేదంటే ట్రోలింగ్ వేరే లెవెల్లో ఉండేది.

కట్ చేస్తే ఇప్పటికే తీసిన ఒక సీక్వెల్ సరిపోదని.. కొత్తగా తమిళంలో ‘చంద్రముఖి’ పేరే వాడుకుని ఇంకో సీక్వెల్ తీశాడు పి.వాసు. హీరోగా రాఘవ లారెన్స్‌ను ఎంచుకుని.. చంద్రముఖిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ఎంచుకున్నాడు వాసు. లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించింది. ఐతే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ఏ ప్రోమో కూడా ఆకట్టుకోలేదు. రాజు పాత్రలో రాఘవ లారెన్స్ లుక్ చూసి ఇదేమైనా ‘చంద్రముఖి’ స్పూఫా అనిపించింది. రజినీని కనీస స్థాయిలో కూడా అతను మ్యాచ్ చేయలేకపోయాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. అదైతే ప్రేక్షకుల్లో కనీస ఆసక్తిని కూడా రేకెత్తించలేకపోయింది.

ఇందులో లారెన్స్ మోడర్న్ గెటప్‌లో, అలాగే రాజుగా ఏమాత్రం మెప్పించలేకపోయాడు. రాజు పాత్రలో అతణ్ని చూస్తుంటే పక్కాగా ఇది స్పూఫ్ మూవీనే అనిపించింది. ట్రైలర్ మినిమం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. పి.వాసు ఔట్ డేటెడ్ స్టయిల్లోనే సినిమాను డీల్ చేసినట్లున్నాడు. చూస్తుంటే ‘నాగవల్లి’ని మించి ‘చంద్రముఖి-2’ ట్రోల్ మెటీరియల్ లాగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి.