అర్జున్ రెడ్డి కాంబో వినడానికి బాగుంది కానీ

టాలీవుడ్ పాత్ బ్రేకింగ్ మూవీస్ లో ఒకటిగా అర్జున్ రెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. పబ్లిసిటీతో మొదలుపెట్టి కంటెంట్ వరకు ప్రతి విషయంలోనూ ట్రెండ్ సెట్టర్ అనిపించే రేంజ్ లో దీని గురించి జరిగిన డిస్కషన్లు, యంగ్ మేకర్స్ మీద చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. నిర్మాతలు ముందుకు రాకపోతే తన స్వంత డబ్బుని సోదరుడి సహాయంతో పెట్టుబడిగా పెట్టాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అదిచ్చిన బ్లాక్ బస్టర్ కిక్ ఏకంగా బాలీవుడ్ కు తీసుకెళ్లి రెండు మూడు వందల కోట్ల ప్రాజెక్టులు వచ్చేలా చేసింది. డిసెంబర్ లో వచ్చే అనిమల్ మీద అంచనాల గురించి చెప్పనక్కర్లేదు.

ఖుషి ప్రమోషన్లలో భాగంగా మైత్రి రవి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ-సందీప్ వంగాల కాంబోని రిపీట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నామని ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇది చూసిన రౌడీ హీరో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు ఉంటుందా అని లెక్కలేసుకోవడం మొదలుపెట్టారు. అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇది అప్పుడప్పుడే జరగదు. యానిమల్ డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. అప్పటిదాకా సందీప్ కనీసం బయటికి రాడు. దాని తర్వాత కొంత విశ్రాంతి తీసుకుని ప్రభాస్ స్పిరిట్ స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టాలి. ఫైనల్ వెర్షన్ లాక్ చేసి డార్లింగ్ కి వినిపించాలి.

దీనికి ఎంత లేదన్నా ఆరేడు నెలలు పడుతుంది. ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టి అంత ప్యాన్ ఇండియా మూవీని ఫినిష్ చేయాలంటే తక్కువలో తక్కువ రెండేళ్లు పట్టే అవకాశాలు ఎక్కువ. అదే జరిగితే 2025 దాటిపోతుంది. మైత్రి నిర్మాతలు విజయ్, సందీప్ లతో కమిట్ మెంట్ తీసుకున్నా సరే కార్యరూపం దాల్చేందుకు సమయం పడుతుంది. పైగా అర్జున్ రెడ్డి కలయిక అంటే దాన్ని తలదన్నే సబ్జెక్టు రెడీ చేయాలి. సందీప్ వంగా టార్గెట్ ఫిల్మోగ్రఫీలో మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్ ఉన్నారు. మరి మొదటి ప్రయారిటీ తన డెబ్యూ హీరోకే ఇస్తాడా లేక లేట్ చేస్తాడానేది బాగా వెయిట్ చేసి చూడాలి.