నితిన్ సినిమాతో లయ రీఎంట్రీ?

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లకు ఎప్పట్నుంచో సరైన ప్రాధాన్యం ఉండట్లేదు. గత మూడు దశాబ్దాల్లో పరిస్థితి చూస్తే.. అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్లు కూడా చాలామంది ఒక స్థాయికి మించి ఎదగలేకపోయారు. ఐతే ఉన్నంతలో మిగతా వాళ్లతో పోలిస్తే లయ మెరుగనే చెప్పాలి. ఆమె నందమూరి బాలకృష్ణ లాంటి టాప్ స్టార్‌తో సినిమా చేసింది. మిడ్ రేంజ్ హీరోలు చాలామందితో జట్టు కట్టింది.

ఒక ఐదారేళ్లు ఆమె హవా బాగానే నడిచింది. ఐతే ఇంకా కెరీర్ ఉండగానే ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకుని యుఎస్‌లో సెటిలైపోయింది ఈ విజయవాడ అమ్మాయి. తర్వాత సినిమాల వైపే చూడలేదు. ఆ మధ్య ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ షూటింగ్ అంతా యుఎస్‌లోనే జరగడం, అందులో తన కూతురు ఒక ముఖ్య పాత్ర పోషించడంతో లయ చిన్న క్యామియో రోల్ లాంటిది చేసింది కానీ.. మరే చిత్రంలోనూ నటించలేదు.

పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతల మధ్య సినిమాల కోసం ఇండియాకు వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితి లేకపోవడం వల్లే పెళ్లి తర్వాత నటించలేదని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పిన లయ.. ఇప్పుడో పేరున్న సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. నితిన్ కొత్త సినిమా ‘తమ్ముడు’తో ఆమె టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోందట.

ఇందులో హీరో సోదరి పాత్రలో ఆమె కనిపించనుందని.. కథలో తన క్యారెక్టర్ కీలకమని.. అందుకే సినిమాకు ‘తమ్ముడు’ అనే టైటిల్ కూడా పెట్టారని తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా కూడా ఒక వెరైటీ ఆప్షన్ ఎంచుకున్నారట. సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ చిత్రం ‘కాంతార’లో కథానాయికగా నటించి మెప్పించిన సప్తమి గౌడ ‘తమ్ముడు’తో టాలీవుడ్లోకి అడుగు పెట్టనుందట. కథానాయికది మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రే అని.. అందుకే మంచి నటిగా పేరు తెచ్చుకున్న సప్తమిని ఎంచుకున్నారని సమాచారం.