సమంత అనుష్క ఇద్దరికీ చెరో సమస్య

హీరోతో సమానంగా ఒక హీరోయిన్ కు సినిమా తరఫున బ్రాండింగ్ జరుగుతున్నప్పుడు ప్రమోషన్లలో చాలా యాక్టివ్ గా ఉండాలి. దర్శక నిర్మాతలు అదే కోరుకుంటారు. కానీ వారం గ్యాప్ లో థియేటర్లలో అడుగు పెడుతున్న సమంతా, అనుష్కలకు ఒకే రకమైన సమస్య రానివ్వకుండా చేస్తోంది. సామ్ కు ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య చికిత్స కోసం అమెరికా వెళ్లిపోయింది. అదేదో రిలీజ్ తర్వాత వెళ్లొచ్చు కదానే ప్రశ్న ఉత్పన్నమయ్యింది కానీ శాకుంతలం కోసం విపరీతంగా కష్టపడినప్పుడు ఫలితం దక్కలేదు. కాబట్టి ఇప్పుడు సక్సెస్ అయ్యాక దాన్ని ఎంజాయ్ చేయాలని డిసైడయ్యింది కాబోలు.

అనుష్కకు అంత తీవ్రమైన వ్యాధి లేదు కానీ కొన్నేళ్లుగా మీడియా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు. కొంచెం బొద్దుగా మారిన మాట వాస్తవమే. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ లో ఫ్యాన్స్ గమనించారు. పైగా స్కిన్ టోన్ కోసం ఫిల్టర్లు వాడటం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు మీడియా ముందుకు వస్తే వీటికి సంబంధించిన ప్రశ్నలు ఎదురు కావొచ్చు. నేనెలా ఉంటే మీకెందుకని సమాధానం చెప్పొచ్చు కానీ అదంతా లేనిపోని చర్చకు, ట్రోలింగ్ కి దారిస్తుంది. అయినా రెండు గంటల సినిమాలో నటించినప్పుడు లేని మొహమాటం ఓ వారం రోజులు బయటకు వస్తే ఏంటనేది మరో క్వశ్చన్.

ఏది ఏమైనా రావడం రాకపోవడం ఇద్దరి వ్యక్తిగత నిర్ణయమే అయినా దీని వల్ల విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి ఇద్దరూ పబ్లిసిటీ బరువును తమ భుజాల మీద మోస్తున్నారు. విసుగు లేకుండా ఇంటర్వ్యూలు, నిర్మాతలు షెడ్యూల్ చేసిన టూర్లకు హాజరు కావడం అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. సామ్, స్వీటీల ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశ పడినప్పటికే సినిమాలు హిట్ అయితే చాలని కోరుకుంటున్నారు. కాకతాళీయంగా రెండూ ఒక ప్రేమ జంట మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాలు కావడం విశేషం. బిజినెస్ పరంగా ఖుషిదే పై చేయి అయినప్పటికీ శెట్టి జంటను తక్కువంచనా వేయడానికి లేదు.