సాయిపల్లవి గ్యాప్ ఎందుకు తీసుకున్నట్టు

కోట్లు ఇస్తామన్నా సరే పాత్ర నచ్చితేనే సినిమాలు ఒప్పుకునే సాయిపల్లవి తెరమీద కనిపించి చాలా గ్యాప్ వచ్చేసింది. దర్శక నిర్మాతలు ఆఫర్లు ఇస్తున్నా సరే రెగ్యులర్ క్యారెక్టర్లకు ససేమిరా అంటున్న ఈ కేరళ కుట్టి హీరోయిన్ల రేసులో వెనుకబడుతున్నా సరే ఎంత మాత్రం లెక్క చేయడం లేదు. 2022లో  చేసిన విరాట పర్వం పెర్ఫార్మన్స్ పరంగా పేరు తీసుకొచ్చింది కానీ కమర్షియల్ గా అదెంత పెద్ద ఫెయిల్యూరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గార్గికి విమర్శకుల ప్రశంసలు దక్కినా బాక్సాఫీస్ దగ్గర కాసులు రాలేదు. వీటికి ముందు ఏడాది లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ రెండు హిట్లు ఖాతాలో ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితిలో సాయిపల్లవి ఏ సినిమా చేస్తోందనే అనుమానం రావడం సహజం. ప్రస్తుతం తను ఒప్పుకున్న చిత్రం శివ కార్తికేయన్ తో జోడి కట్టే పీరియాడిక్ డ్రామా ఒకటే. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కొంత భాగం షూట్ పూర్తయ్యింది. కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. కాన్సెప్ట్ ఇలా ఉన్నప్పటికీ డాన్సులకు ప్రాధాన్యం ఉంటుందని, అవి మెల్లగా తెలుస్తాయని అంటున్నారు.

దీని సంగతలా ఉంచితే నాగ చైతన్య దర్శకుడు చందూ మొండేటి కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీలో కీర్తి సురేష్ తో పాటు సాయిపల్లవిని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. చైతుతో చేసిన లవ్ స్టోరీ ఆల్రెడీ హిట్టయ్యింది కాబట్టి ఈ కాంబినేషన్ బాగా వర్కౌట్ చేయొచ్చనే దిశగా అడుగుతున్నారని వినికిడి. మరి ఆమె ఎస్ చెప్పింది లేనిది ఇంకా తెలియాల్సి ఉంది. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే సామెతకు భిన్నంగా దీపాన్ని సరిగా వెలిగించుకున్నాకే ఇల్లు చక్కబెట్టుకుంటాననే సాయిపల్లవి ఇలా అయితే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయడం డౌటే.