ధనుష్ కూడా షాకైపోతుంటాడు

ఈ మధ్యే సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే 15 ఏళ్ల కిందటి అనువాద చిత్రం తెలుగులో రీ రిలీజ్ అయింది. అదొక క్లాస్ మూవీ. మొదట్లో రిలీజైనపుడు ఆశించిన విజయం ఏమీ సాధించలేదు. ఏదో ఒక మాదిరిగా ఆడింది. ఇలాంటి క్లాస్ మూవీని ఇన్నేళ్ల తర్వాత తెలుగులో రీ రిలీజ్ చేస్తే ఎగబడి చూశారు ప్రేక్షకులు. సూర్య నుంచి గత కొన్నేళ్లలో వచ్చిన ఏ సినిమాకూ లేనంత క్రేజ్ ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’కు కనిపించింది. ఉదయం 8 గంటలకు పెద్ద సంఖ్యలో షోలు పడగా.. అవన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి.

థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి సూర్య సైతం షాకయ్యాడు. చాలా ఎగ్జైట్ అవుతూ తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు. ఒక పాత అనువాద చిత్రం మీద తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమకు తమిళ క్రిటిక్స్, ట్రేడ్ పండిట్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మరో తమిళ అనువాద చిత్రం ఇలాంటి ఆశ్చర్యమే కలిగిస్తోంది.

ధనుష్ మూవీ ‘రఘువరన్ బీటెక్’ను శుక్రవారం  రీ రిలీజ్ చేశారు. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీస్‌, టౌన్లలో ఈ సినిమాకు స్పెషల్ షోలు పడ్డాయి. వందకు పైగా థియేటర్లలో సినిమా రిలీజైంది. ఉదయం హైదరాబాద్‌లో 8 గంటలకే షోలు పడగా.. అవన్నీ హౌస్ ఫుల్ అయిపోయాయి. యథాప్రకారం మన ప్రేక్షకులు థియేటర్లలో సెలబ్రేషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లారు.

మన సూపర్ స్టార్ల సినిమాలకు చేసినంత హంగామా చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూస్తే సూర్య లాగే ధనుష్ కూడా షాకవ్వకుండా ఉండలేడు. ఇదే సినిమాను తమిళంలో ఇప్పుడు రిలీజ్ చేస్తే ఇలాంటి రెస్పాన్స్ ఉండకపోవచ్చు. తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి ఇది రుజువు. దీంతో పాటు రిలీజైన ప్రభాస్ సినిమా ‘యోగి’కి కూడా మంచి రెస్పాన్సే వస్తోంది.