చరణ్ సినిమాను ఆపించేశారు

ఏడాది నుంచి టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ట్రెండ్‌ను బాగా అందిపుచ్చుకుని.. తమ హీరోల కల్ట్ మూవీస్‌ స్పెషల్ షోలతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రామ్ చరణ్ అభిమానులు కూడా కొన్ని నెలల కిందట ‘ఆరెంజ్’ రీ రిలీజ్‌తో సందడి చేశారు. ఆ సినిమా ద్వారా వచ్చిన డబ్బులను నిర్మాత నాగబాబు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు చరణ్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘నాయక్’కు స్పెషల్ షోలు వేయడానికి సన్నాహాలు జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి థర్డ్ పార్టీ ఒకరు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఐతే మధ్యలో ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమాకు స్పెషల్ షోలు పడకుండా ఆపేయడం చర్చనీయాంశంగా మారింది.

మెగా హీరోల సినిమాలేవైనా రీ రిలీజ్ చేయాలంటే ఆ కుటుంబానికి దగ్గరగా ఉండే ఫ్యాన్ క్లబ్స్ అధినేతలు.. పీఆర్వోలు రంగంలోకి దిగుతున్నారు. అభిమాన సంఘాలతో కోఆర్డినేట్ చేసుకుని పెద్ద ఎత్తున రీ రిలీజ్‌లు ప్లాన్ చేస్తున్నారు. వసూళ్లలో కొంత మొత్తాన్ని ఛారిటీకి ఉపయోగించేలా కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ ‘నాయక్’ సినిమాకు అలా జరగలేదని తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీ పీఆర్వోలతో.. అభిమాన సంఘాల వాళ్లతో ఏమాత్రం టచ్ లేని వ్యక్తులు సొంతంగా రీ రిలీజ్ ప్రణాళికలు రచించారు. ఇది అభిమాన సంఘాలను నడిపించే వాళ్లకు, పీఆర్ వర్గాలకు రుచించడం లేదు. చిరు పుట్టిన రోజును.. మెగా అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకుని బయటి వ్యక్తులు లాభ పడే ప్రయత్నం చేస్తున్నారని భావించి.. ‘నాయక్’ రీ రిలీజ్‌ను ఆపినట్లు తెలుస్తోంది. ఐతే మంచి ఫ్యాన్ మూమెంట్స్ ఉన్న  ‘నాయక్’ రీ రిలీజ్ ఆగిపోవడం మెగా అభిమానులకు కొంత నిరాశను మిగిల్చింది.