రెండు సినిమాలు పండగ చేసుకున్నాయ్

ఈసారి ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో ఇండియన్ బాక్సాఫీస్ షేకైపోయింది. దశాబ్దాల వ్యవధిలో ఇండిపెండెన్స్‌ డే వీకెండ్లో ఎన్నడూ లేని స్థాయిలో ఫుట్ ఫాల్స్ నమోదైనట్లు ఇండియన్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఇటీవలే ఘనంగా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా 2 కోట్లకు పైగా టికెట్లు తెగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో మేజర్ కంట్రిబ్యూషన్ జైలర్, గదర్-2 చిత్రాలదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

‘ఓఎంజీ’ ఓ మోస్తరుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగా.. ‘భోళా శంకర్’ కొంచెం కంట్రిబ్యూట్ చేసింది. జైలర్, గదర్-2 చిత్రాలైతే వీకెండ్ అయ్యాక కూడా జోరు తగ్గించలేదు. సోమవారం కూడా ఈ సినిమాలకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. అలాంటిది మంగళవారం ఇండిపెండెన్స్ డే సెలవు కావడంతో ఇవి బాక్సాఫీస్ దగ్గర మామూలుగా వసూళ్ల మోత మోగించలేదు. 

తొలి రోజు ఇండియాలో రూ.40 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ‘గదర్-2’.. మంగళవారం ఏకంగా రూ.55 కోట్లు కొల్లగొట్టడం విశేషం. ఆదివారం ఈ చిత్రానికి రూ.51 కోట్లు వచ్చాయి. ఎంత సెలవు రోజైనా సరే.. వీక్ డేలో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అనూహ్యం. బాలీవుడ్ చరిత్రలోనే స్వాతంత్ర్య దినోత్సవం రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘గదర్-2’ రికార్డు సృష్టించింది. మొత్తంగా ఐదు రోజుల్లో ‘గదర్-2’ వసూళ్లు రూ.230 కోట్లకు చేరుకున్నాయి.

ఈ సినిమా రూ.500 కోట్ల మైలురాయి మీద కన్నేసింది. మంగళవారం అక్షయ్ కుమార్ సినిమా ‘ఓఎంజీ-2’ రూ.17 కోట్లు వసూలు చేసింది. ఆ చిత్రం మొత్తంగా రూ.72 కోట్లు కలెక్ట్ చేసింది. మరోవైపు ‘జైలర్’ ఇండిపెండెన్స్ డేకి వరల్డ్ వైడ్ రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా వసూళ్లు రూ.400 కోట్ల మైలురాయిని దాటేశాయి. తెలుగులో ‘జైలర్’ కలెక్షన్లు రూ.50 కోట్ల మార్కును టచ్ చేశాయి. తమిళంలో అన్ని కలెక్షన్ల రికార్డులనూ ‘జైలర్’ బద్దలు కొట్టేయడం లాంఛనమే.