మహేష్‍ని భయపెట్టేసిన మేజర్!

అడివి శేష్‍తో ‘మేజర్‍’ చిత్రాన్ని మహేష్‍ బాబు ప్రొడక్షన్‍ హౌస్‍పై సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంలో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ నాటికి విడుదల చేయాలని మేజర్‍ టీమ్‍ ప్లాన్‍ చేసుకుంటే కరోనా వచ్చి వారి ప్లాన్స్ అన్నీ డిస్టర్బ్ చేసేసింది. అయితే సినిమా షూటింగ్స్పై ఆంక్షలను ప్రభుత్వం ఎత్తి వేయడంతో మేజర్‍ షూటింగ్‍ తక్కువ మంది బృందంతో చేయడానికి సర్వ సన్నద్ధమయి కొన్ని రోజుల షూటింగ్‍ కూడా చేసారు. కొద్ది రోజుల షూటింగ్‍ తర్వాత ముందు జాగ్రత్త కోసమని కరోనా టెస్ట్ యూనిట్‍ అంతా చేయించుకోగా వారిలో సగం మందికి పాజిటివ్‍ వచ్చిందట.

ఈ విషయం తెలిసి నమ్రత, మహేష్‍ షూటింగ్‍ ఉన్నపళంగా ఆపేసి క్వారంటైన్‍కు వెళ్లమన్నారట. రేపో మాపో తాను కూడా షూటింగ్‍ మొదలు పెట్టాలని అనుకుంటోన్న మహేష్‍కి బయట పరిస్థితులు ఎలా వున్నాయనేది అర్థమయింది. కరోనా పూర్తిగా కంట్రోల్‍లోకి వచ్చే వరకు షూటింగ్స్కి వెళ్లకూడదని ఈ సంఘటన తర్వాత మన తెలుగు హీరోలు మరింతగా ఫిక్స్ అయిపోయారట. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‍ చేస్తున్నా కానీ కరోనా ఏదో ఒక రకంగా కమ్ముకొచ్చేస్తూ వుండడంతో అసలు ఇక షూటింగ్స్ ప్రశాంతంగా ఎప్పటికి చేసుకోవచ్చుననేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నిర్మాతలు.