ఇక్కడ రజినీ.. అక్కడ అతను

ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ఇండియన్ బాక్సాఫీస్ కళకళలాడిపోతోంది. దేశవ్యాప్తంగా థియేటర్లలో సందడి కనిపిస్తోంది. సౌత్ ఇండియా అంతటా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రభంజనం కొనసాగుతుంటే.. ఉత్తరాది బెల్ట్ అంతా సన్నీ డియోల్ సునామీ కనిపిస్తోంది. ‘జైలర్’ మూవీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ అని తేడా లేకుండా సౌత్ ఇండియా అంతటా వసూళ్ల మోత మోగిస్తోంది.

నాలుగు రోజుల ఎక్స్‌టెండెడ్ వీకెండ్లో రజినీ సినిమా ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. తమిళంలో ఈ సినిమాకు పోటీనే లేదు. అలాగే కేరళ, కర్ణాటకల్లోనూ ‘జైలర్’కు ఎదురే లేకపోయింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’ రిలీజైనా దాని ప్రభావం పెద్దగా లేదు. చిరు సినిమాను పూర్తిగా వెనక్కి నెట్టేసి ‘జైలర్’ అనూహ్యమైన స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ‘2.ఓ’ తర్వాత రజినీ సినిమాకు ఈ స్థాయి రెస్పాన్స్ రావడం ఇదే.

ఇక నార్త్ ఇండియన్ మార్కెట్ విషయానికి వస్తే ‘గదర్-2’ హిందీ ప్రేక్షకులను మామూలుగా ఊపేయలేదు. 20 ఏళ్ల ముందు వచ్చిన ‘గదర్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా అందరి అంచనాలనూ మించిపోయింది. ‘గదర్’ తర్వాత సన్నీకి ఆ స్థాయి సక్సెస్ ఒక్కటీ లేదు. సన్నీని ప్రేక్షకులు దాదాపుగా మరిచిపోయిన పరిస్థితి. హీరోయిన్ అమీషా పటేల్ అయితే ఎప్పుడో ఔట్ డేట్ అయిపోయింది. ఇలాంటి జంట మళ్లీ కలిసి ‘గదర్-2’ చేస్తే ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నారు ఒక దశలో.

కానీ రిలీజ్ ముంగిట ఈ సినిమా మంచి హైప్ తెచ్చుకుంది. హిందీ మాస్ ఆడియన్స్ ఈ సినిమాను విరగబడి చూస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత నార్త్ రూరల్ ఏరియాల్లోని సింగిల్ స్క్రీన్లు జనాలతో పోటెత్తుతున్నాయి. తొలి రెండు రోజుల్లోనే ఇండియాలో రూ.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ‘గదర్-2’.. ఆదివారం ఏకంగా రూ.50 కోట్ల మార్కును దాటేసింది. అక్షయ్ కుమార్ సినిమా ‘ఓఎంజీ-2’ మంచి టాక్ తెచ్చుకుని కూడా ‘గదర్-2’ ముందు నిలవలేకపోయింది. ఆ సినిమా ఇంకా రూ.50 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. మంగళవారం ఇండిపెండెన్స్ డే నాడు ‘గదర్-2’ రూ.60 కోట్లకు తక్కువ వసూళ్లు రాబట్టదని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.500 కోట్ల రేంజికి వెళ్లినా ఆశ్చర్యం లేదు.