మంచినీళ్లు తాగినంత సులభంగా 300 కోట్లు

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ ఊచకోత మాములుగా లేదు. గురువారం విడుదలతో అతి పెద్ద అడ్వాంటేజ్ తీసుకున్న తలైవర్ నాలుగు రోజుల పాటు బాక్సాఫీస్ ని ఎడాపెడా బాదేశాడు. కర్ణాటకలో ఆదివారం తెల్లవారుఝామున ఆరు గంటల షోలు వేస్తున్నా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇక్కడే ఇలా ఉంటే ఇక తమిళనాడు గురించి చెప్పదేముంది. ఏపీ తెలంగాణలో యుద్ధ ప్రాతిపదికన స్క్రీన్లు పెంచేశారు. భోళా శంకర్ కు తగ్గించి జైలర్ కు ఇవ్వడం ఓపెన్ సీక్రెట్. ఇన్ని చేసినా టికెట్లు అంత సులభంగా దొరకడం లేదు. ఇక లెక్కలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి.

ఇప్పటిదాకా జైలర్ అన్ని వెర్షన్లు కలిపి  301 కోట్ల గ్రాస్ దాటేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. తమిళం 82 కోట్లు, తెలుగు రాష్ట్రాలు 34 కోట్లు, కర్ణాటక 32 కోట్లు, కేరళ 23 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా 4 కోట్ల 50 లక్షలు, ఓవర్సీస్ 125 కోట్లు ఇలా ఎక్కడ చూసినా అరాచకానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. కేవలం ఏపీ తెలంగాణ వరకు చూసుకుంటే 12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ కి ఆల్రెడీ 6 కోట్ల దాకా లాభం వచ్చేసింది. కొన్న బయ్యర్లందరూ లాభాల్లోకి వెళ్లిపోయారు. ఇంకా సెకండ్ వీక్ రాలేదు. రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేషనల్ హాలిడే ఉంది కాబట్టి ఫిగర్లు ఊహించిన దానికన్నా భారీగా ఉండబోతున్నాయి.

దెబ్బకు కోలీవుడ్ లో విక్రమ్, పొన్నియిన్ సెల్వన్, తునివు, వరిసు పేరు మీద ఉన్న రికార్డులన్నీ చెల్లాచెదురైపోయాయి. రజని మాత్రం ప్రశాంతంగా హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇక్కడ ముత్తువేల్ పాండియన్ చేస్తున్న రచ్చ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వెళ్తూనే ఉన్నాయి. బీస్ట్ వల్ల కొంత నిరాశ చెందిన దర్శకుడు నెల్సన్దిలీప్ కుమార్ ఒక్కసారిగా టాప్ లీగ్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తీసుకుంటున్న పారితోషికానికి రెండింతలు మూడింతలు ఎక్కువ ఇస్తామని నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక అనిరుద్ రవిచందర్ కొస్తున్న ఆఫర్ల గురించి చెప్పేదేముంది.