ఆ ద‌ర్శ‌కుడికి సెంటిమెంటుగా మారిన ఆ న‌టి

కొంద‌రు ద‌ర్శ‌కులు త‌మ సినిమాల్లో హీరోయిన్ల‌ను రిపీట్ చేస్తే.. కొంద‌రేమో ఫ‌లానా క‌మెడియ‌న్ త‌న ప్ర‌తి సినిమాలో ఉండాల‌ని ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. ఈ విష‌యంలో స్నేహం మాత్ర‌మే కాదు.. సెంటిమెంట్లు కూడా ఉంటాయి. టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేనికి కూడా ఇప్పుడు ఓ న‌టి సెంటిమెంటుగా మారింది. ఆమె ఎవ‌రో కాదు.. త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్. త‌మిళంలో హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసి టైం క‌లిసి రాక‌పోవ‌డంతో క్యారెక్ట‌ర్, విల‌న్ రోల్స్ వైపు మ‌ళ్లింది శ‌ర‌త్ కుమార్ త‌న‌య‌.

ఈ మ‌ధ్య త‌మిళంలో కంటే కూడా తెలుగులో ఆమెకు డిమాండ్ పెరిగింది. వ‌ర‌లక్ష్మి నెగెటివ్ రోల్స్ చేసిన సినిమాలు వ‌రుస‌గా హిట్ట‌వుతుండ‌ట‌మే అందుక్కార‌ణం. ఆమెకు డిమాండ్ పెరిగేలా చేయ‌డంలో గోపీచంద్ పాత్ర కూడా కీల‌క‌మే.
గోపీచంద్‌కు చాన్నాళ్ల త‌ర్వాత పెద్ద హిట్ అందించిన క్రాక్ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి చేసిన జ‌య‌మ్మ పాత్ర ఎంత బాగా క్లిక్ అయిందో తెలిసిందే. త‌న‌ త‌ర్వాతి సినిమా వీర‌సింహారెడ్డిలోనూ వ‌ర‌ల‌క్ష్మికి కీల‌క పాత్ర ఇచ్చాడు గోపీ. ఆ సినిమా కూడా సూప‌ర్ హిట్ అయింది.

వ‌ర‌ల‌క్ష్మి పాత్ర కూడా బాగా ప్ల‌స్ అయింది. దీంతో ఆమెను త‌న ల‌క్కీ ఛార్మ్‌గా భావించి.. త‌ర్వాతి సినిమాలోనూ త‌న‌కోసం ఒక పాత్ర క్రియేట్ చేశాడ‌ట గోపీ. డాన్ శీను, బ‌లుపు, క్రాక్ త‌ర్వాత గోపీ-ర‌వితేజ క‌ల‌యిక‌లో కొత్త సినిమా ఇటీవ‌లే అనౌన్స్ అయిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే షూటింగ్ కూడా మొద‌లు కాబోతోంది. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. ఈ చిత్రానికి ఇంకా క‌థానాయిక ఖ‌రార‌వ్వ‌లేదు కానీ.. వ‌ర‌ల‌క్ష్మి మాత్రం ఒక ముఖ్య పాత్రకు ఓకే అయిపోయింద‌ట‌. వీర‌సింహారెడ్డి మూవీని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్సే ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది.