అనవసరంగా అజిత్ అభిమానులను గిల్లారు

సోషల్ మీడియా జమానాలో ఏదైనా మాట్లాడేటప్పుడు సెలబ్రిటీలు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఉండటం అవసరం. లేదంటే ట్రోలింగ్ బ్యాచులకు దొరికిపోవడం ఖాయం. ఇవాళ మీడియాతో ప్రెస్ మీట్ పెట్టిన భోళా దర్శకుడు మెహర్ రమేష్ అన్న మాటలు అజిత్ ఫ్యాన్స్ ని అనవసరంగా గిల్లేశాయి. రీమేకుల ప్రస్తావన వచ్చినప్పుడు వేదాళంలో పదింతలు ఎక్కువ క్రింజ్ ఉంటుందని, అదంతా తాను తీయలేదని, అవసరమైన మార్పులు చేర్పులు చేసి నా స్టైల్ లో చిరంజీవిని ప్రెజెంట్ చేశానని చెప్పుకొచ్చాడు. సరే కంటెంట్ మీద నమ్మకంతో మన గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు.

కానీ వేదాళంని మరీ తీసిపారేయలేం. నిజంగా అందులో అంత రొట్ట మాస్ ఉంటే మెగాస్టార్ చూసిన వెంటనే నో చెప్పేవారుగా. సో తనకు సూటయ్యే కంటెంట్ ఉందని భావించడం వల్లే ఓకే చెప్పారు. అలాంటప్పుడు అజిత్ మూవీని  తక్కువ చేయడం కరెక్ట్ కాదనేది నెటిజెన్ల అభిప్రాయం. వేదాళం రిలీజయినపుడు తమిళనాడుని వరదలు ముంచెత్తుతున్నాయి. అయినా సరే మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ సాధించింది. ఆ ఏడాది టాప్ లో నిలబడింది. మన ఆడియన్స్ సైతం అందుబాటులో ఉన్న టైంలో ఆన్ లైన్లో చూసి బాగుందని మెచ్చుకుని ట్వీట్లు గట్రా పెట్టారు.

మా సినిమానే క్రింజ్ అంటావాని అజిత్ అభిమానులు మెల్లగా మెహర్ గత చిత్రాలు షాడో, శక్తి తాలూకు వీడియోలు బయటికి తీసి ఇదేంటో చెబుతావా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మాములుగానే వాళ్లకు ప్రాంతీయాభిమానం, హీరోల మీద ఆరాధనాభావం ఎక్కువ. అలాంటిది ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తే ఎంతటి ట్రోలింగ్ కైనా తెగబడతారు. ఒకవేళ భోళా శంకర్ బ్లాక్ బస్టర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. నేను చెప్పింది కరెక్టే కదాని సర్దిచెప్పుకోవచ్చు. రిలీజయ్యాక ఫలితం చూసి చెప్పి ఉంటే బాగుండేది. కొంచెం తొందరపడినట్టుగానే కనిపిస్తోంది. దీని ఎఫెక్ట్ తక్కువగా ఉంటేనే బెటర్.