చైతు 23 కథలో పాకిస్థాన్ లింకు

కథల ఎంపికలో ఎక్కడ పొరపాటు జరుగుతోందో గుర్తించిన నాగ చైతన్య ఈసారి ఎంత మాత్రం తొందరపడటం లేదు. గీతా ఆర్ట్స్ 2 భారీ బడ్జెట్ తో సిద్ధంగా ఉన్నప్పటికీ కథకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడం కోసం ప్రత్యేకంగా దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాస్ తో కలిసి నిజ జాలర్లతో మాట్లాడుతూ వాళ్ళ జీవన విధానం మీద క్షుణ్ణంగా అవగాహన పెంచుకుంటున్నాడు. వాటి తాలూకు ఫోటోలు, వీడియోలు ఆల్రెడీ ట్విట్టర్, ఇన్స్ టాలో వైరలవుతున్నాయి. దీనికి తండేల్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ యూనిట్ దాని గురించి అధికారికంగా మాట్లాడ్డం లేదు.

ఇక కథకు సంబంధించిన ఒక కీలక క్లూ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. దాని ప్రకారం ఇది 2018 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ కు వెళ్లే క్రమంలో 22 సభ్యులున్న ఒక చేపలు పట్టే గుంపు సముద్రంలో తప్పిపోయి పాకిస్థాన్ కు చెందిన కరాచీ అధికారులకు దొరికిపోతుంది. అక్కడ ఏడాదికి పైగా కారాగారం పాలై నరకం చవి చూశాక వాళ్ళ స్నేహితుడు, బంధువైన చైతు కాపాడేందుకు రిస్క్ చేసి పాక్ వెళ్తాడు. ఇక అక్కడి నుంచి సాహస యాత్ర మొదలవుతుంది. వాళ్ళను విడిపించుకుని ఎలా తప్పించుకున్నాడనే పాయింట్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట.

నిర్ధారణగా ఇదే అని చెప్పలేం కానీ పాయింట్ అయితే నమ్మదగినట్టే అనిపిస్తోంది. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్, అనిరుద్ రవిచందర్ ఇద్దరిలో ఒకరిని లాక్ చేసే పనిలో ఉన్నారు. మొదటి పేరే కన్ఫర్మ్ అని ఇన్ సైడ్ టాక్. థాంక్ యు, లాల్ సింగ్ చద్దా, కస్టడీ వరస డిజాస్టర్ల తర్వాత చైతన్య పూర్తిగా మేకోవర్ చేసుకుని తండేల్ కోసం రెడీ అవుతున్నాడు. చందూ మొండేటి కెరీర్ లోనూ ఇది అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోంది. అరవై కోట్లకు పైమాటేనని వినిపిస్తోంది కానీ రంగంలోకి దిగాక అంతకంటే చాలా ఎక్కువ కావొచ్చని దాని మీద వర్క్ చేస్తున్న వాళ్ళ కామెంట్. మొత్తానికి చైతు 23 సాలిడ్ గా ఉండబోతోంది.