బ్రో మ్యాచులో ఆఖరి బంతి  

పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ తొలి కలయిక బ్రో ది అవతార్ తీపి జ్ఞాపకంగా మిగులుతుందనుకుంటే  అందులో క్లైమాక్స్ లాగే చేదుగా మారుతోంది. నిన్నటితో మొదటి వారం పూర్తి చేసుకున్న బ్రో ఇప్పటిదాకా వసూలు చేసిన షేర్ 55 నుంచి 60 కోట్ల మధ్యలోనే ఉందని ట్రేడ్ రిపోర్ట్. మొదటి మూడు రోజులు చూపించిన దూకుడు ఒక్కసారిగా కింద పడిపోవడంతో మళ్ళీ కోలుకోలేదు. అంబటి రాంబాబు వివాదం, దాని మీద న్యూస్ ఛానల్స్ లో జరిగిన చర్చ మైలేజ్ ఇవ్వలేదని అర్థమవుతోంది. ట్విట్టర్ లో వీడియోలు వైరల్ చేసుకోవడానికి తప్ప ఈ ఇష్యూ వల్ల ఒరిగిందేమీ లేదు.

బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే 95 కోట్ల షేర్ ని దాటేయాలి. అంటే ఇంకా 40 కోట్ల దాకా వసూలు కావాలి. ఈ ఒక్క వీకెండ్ మాత్రమే చేతిలో ఉంది. శుక్రవారం చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్ద ఛాయస్ లు లేవు. సో సెలవుని థియేటర్ లో ఎంజాయ్ చేయాలంటే బ్రో తప్ప వేరే మార్గం లేదు. అలా అని థియేటర్లు నిండిపోతాయని కాదు. సూర్య సన్ అఫ్ కృష్ణన్ లాంటి రీ రిలీజులకు కనిపిస్తున్న రెస్పాన్స్ ఇవాళ మిగిలిన వాటికి లేదు. వచ్చే వారం రజనీకాంత్ జైలర్, అన్నయ్య చిరంజీవి భోళా శంకర్ లు గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి.

ఆ సమయానికి బ్రో థియేటర్లు చాలా మటుకు తగ్గిపోయి నామమాత్రంగా మిగులుతాయి. అలాంటప్పుడు తొంభై అయిదు కోట్ల మార్కుని చేరుకోవడం జరగని పని. కనీసం సూపర్ హిట్ అవుతుందనుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ ట్రెండ్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటు బ్రో బృందానికి సైతం వాస్తవాలు కనిపిస్తున్నాయి. సాయి తేజ్ సక్సెస్ టూర్ అంటూ బయలుదేరాడు కానీ దాని వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా లేదని అర్థం చేసుకుని షెడ్యూల్ చేసిన ప్లాన్ కన్నా ముందే హైదరాబాద్ కు తిరిగి రావొచ్చని ఇన్ సైడ్ టాక్. ఇక మెగా ఫ్యాన్స్ చూపంతా నెక్స్ట్ భోళా శంకర్ మీదే.