త్రివిక్రమ్ బ్రాండ్ బీటింగ్!

టాలీవుడ్లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అగ్ర దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయన సక్సెస్ రేట్ కూడా గొప్పగా ఉంటుంది. ఒక్క ‘అజ్ఞాతవాసి’ సినిమా విషయంలోనే త్రివిక్రమ్ పూర్తిగా నిరాశ పరిచాడు. కానీ ఆ సినిమా తర్వాత ‘అరవింద సమేత’తో మాటల మాంత్రికుడు బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆపై తీసిన ‘అల వైకుంఠపురము’లో అయితే నాన్ బాహుబలి హిట్టయి.. త్రివిక్రమ్ స్థాయి ఏంటో చూపించింది.

దీని తర్వాత త్రివిక్రమ్ తీసే సినిమా మీద ఇంకా ఎక్కువ అంచనాలు ఉండాల్సింది. కానీ ఆయన ప్లానింగ్ ఎక్కడో తేడా కొట్టింది. నెక్స్ట్ మూవీ చుట్టూ నెగెటివిటీ ముసురుకుంది. నిజానికి ‘అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సింది. కానీ ఏడాది పాటు వార్తల్లో ఉన్న ఆ సినిమా ఎందుకో క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత మహేష్ బాబుతో మొదలైన సినిమా వ్యవహారం ఎన్ని మలుపులు తిరిగిందో తెలిసిందే.

త్రివిక్రమ్ కెరీర్లోనే ‘గుంటూరు కారం’ విషయంలో ఉన్నంత నెగెటివిటీ మరే సినిమా విషయంలోనూ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఏ ముహూర్తాన ఈ చిత్రం మొదలైందో కానీ.. అనేక అవాంతరాలు, మార్పులు చేర్పులతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు తగ్గిపోయేలా చేసింది. ఇటు మహేష్, అటు త్రివిక్రమ్ అభిమానులిద్దరిలోనూ ఈ చిత్రంపై పెద్దగా ఆశలు లేవు ప్రస్తుతానికి. ఇద్దరూ కూడా మొదలుపెట్టాం కాబట్టి పూర్తి చేయక తప్పదు అని ఏదో మొక్కుబడిగా ఈ సినిమా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా గురించి నెగెటివ్ న్యూస్‌లు హల్‌చల్ చేస్తున్న సమయంలోనే త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చిన ‘బ్రో’ మూవీ రిలీజైంది.

ఈ చిత్రం విషయంలో త్రివిక్రమ్ చాలా విమర్శలే ఎదుర్కొన్నాడు. ఎప్పుడూ త్రివిక్రమ్‌ను ఓన్ చేసుకునే పవన్ ఫ్యాన్స్ ఈసారి మాత్రం యాంటీ అయ్యారు. పవన్‌కు ఇలాంటి ప్రాజెక్టు సెట్ చేయడమే కాక తన ముద్రను చూపించేలా మాటలు రాయలేదనే అసంతృప్తి వారిలో ఉంది. అందుకే సోషల్ మీడియాలో ఆయనపై రిలీజ్ రోజు నుంచి ట్రోలింగ్ జరుగుతోంది సోషల్ మీడియాలో. ఓవైపు ‘గుంటూరు కారం’ తాలూకు నెగెటివిటీ.. ఇంకో వైపు ‘బ్రో’కు సంబంధించిన విమర్శలతో త్రివిక్రమ్ బ్రాండ్ బాగా బీటింగ్‌కు గురవుతోందన్నది వాస్తవం.