బేబి అభిమానులకు అదనపు కానుక

బ్రో రిలీజ్ వల్ల బేబీ థియేటర్లు ఈ రోజు నుంచి చాలా తగ్గిపోయాయి. స్క్రీన్లు తక్కువగా ఉన్న చోట వీకెండ్ వరకు బ్రోతో రీప్లేస్ చేసేలా నిర్మాతలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా  షోలు నడుస్తున్నాయి. అలా అని బేబీ ఫైనల్ రన్ కు వచ్చిందని కాదు. డిస్ట్రిబ్యూటర్లు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం బ్రోకు వచ్చిన డివైడ్ టాక్ తిరిగి సాయిరాజేష్ బృందానికే బూస్ట్ అవుతుందని, మళ్ళీ సోమవారం నుంచి పికప్ చూడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్ట్ 4 రావాల్సిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వాయిదా కలిసి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఛాన్స్ వాడుకునేందుకు బేబీ టీమ్ రెడీ అవుతోంది. ఎడిటింగ్ లో ఇష్టం లేకపోయినా తొలగించాల్సి వచ్చిన 14 నిమిషాల ఫుటేజిని జోడించబోతున్నట్టు తెలిసింది. ఇందులో ఇప్పటిదాకా ఆడియోలో, థియేటర్లో రిలీజ్ చేయని ఏడో పాట ఉండబోతోంది. ఈ కొత్త వెర్షన్ లో ఏఏ సీన్లు ఉంటాయనేది సస్పెన్స్ గా పెట్టారు. లీక్స్ ప్రకారం చూసుకుంటే విరాజ్ అశ్విన్, నాగబాబు, ఆనంద్ తల్లి పాత్రలకు సంబంధించిన ఫినిషింగ్ సరిగా జరగలేదు కాబట్టి వాటిని జోడించవచ్చని అంటున్నారు. దాంతో పాటు వైష్ణవి చైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలు కూడా ఉంటాయట.

ఇలా అయితే యూత్ మళ్ళీ బేబీని చూడటం ఖాయం. ఇప్పటికే కాలేజీ కుర్రాళ్లు, ప్రేమజంటలు పుణ్యమాని బోలెడు రిపీట్ రన్లు దక్కించుకుంది. రెండో వారం నుంచి ఫ్యామిలీస్ కూడా బాగా వస్తున్నాయి. అలాంటప్పుడు డైరెక్టర్స్ కట్ పేరుతో వదిలే స్పెషల్ ఎడిషన్ కి రెస్పాన్స్ ఖచ్చితంగా బాగుంటుంది. ఓటిటి హక్కులు కొన్నది ఆహానే కాబట్టి మరీ త్వరగా డిజిటల్ రిలీజ్ కాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆగస్ట్ 10 నుంచి పెద్ద హీరోలు ఒక్కొక్కరుగా దిగుతున్న నేపథ్యంలో ఆలోగా వీలైనంత ఎక్కువ రాబట్టుకోవడమే బేబీ లక్ష్యం. ఇంకో రెండు వారాలు రన్ దొరికినట్టే.