తెలుగు స్టార్ మీద మిసెస్ ధోని ఫ్యానిజం

ఇప్పటిదాకా మనకు క్రికెటర్ గా, ఇండియాకు వరల్డ్ కప్ సాధించిన కెప్టెన్ గా తెలిసున్న ఎంఎస్ ధోని తాజాగా సినిమా నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే . ఎల్జిఎం పేరుతో రూపొందిన ఫన్ ఎంటర్ టైనర్ త్వరలోనే తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది. హరీష్ కళ్యాణ్, ఇవానా, యోగిబాబు, నదియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రమోషన్ బాధ్యతలు ధోని భార్య సాక్షి చూసుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చి ఇవాళ మీడియాతో కొన్ని ముచ్చట్లు కూడా పంచుకుంది. ఈ సందర్భంగానే తను అభిమానించే టాలీవుడ్ హీరో ఎవరో చెప్పేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకు బాగా ఇష్టమని, ఇప్పటిదాకా ఆయన నటించిన ఏ మూవీని వదలకుండా చూశానని చెప్పింది. ఓటిటిలు, గోల్డ్ మైన్ యూట్యూబ్ ఛానల్స్ లో అన్నీ కవర్ చేశానని చెప్పుకొచ్చింది. వాటిని చూస్తూ పెరిగానని చెప్పిన సాక్షి వయసు ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు. బన్నీకు తనకు ఏడేళ్లే గ్యాప్. అలాంటపుడు బాల్యంలో అల్లు అర్జున్ సినిమాలు చూసే ఛాన్స్ ఎలా ఉంటుంది. ఆ లాజిక్ నే ఫ్యాన్స్ తీస్తున్నారు. ఏదో యథాలాపంగా అని ఉంటుంది కానీ నిజానికి నార్త్ సర్కిల్ లో బన్నీ పాపులారిటీ పెరిగింది సన్ అఫ్ సత్యమూర్తి తర్వాతే.

ఇక ధోని ప్రొడ్యూసర్ గా ఎల్జిఎం మీద భారీ నమ్మకం పెట్టుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ అని నొక్కి చెబుతున్నారు కానీ అది ఎంతమేరకు ఆకట్టుకునేలా ఉంటుందో చూడాలి. పైగా డబ్బింగ్ వెర్షన్ కావడంతో తెలుగులో ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదు. ఇది కాసేపు పక్కనపెడితే బన్నీ ఫాలోయింగ్ ఉత్తరాదిలో ఏ స్థాయిలో ఉందో సాక్షి ధోని మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా తన ఇమేజ్ ఆ రేంజ్ లో పెరిగింది. పుష్ప 2 వచ్చే నాటికి బిజినెస్ పరంగా హిందీ వెర్షన్ భారీ రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ నమ్మడంతో ఆశ్చర్యం ఏముంది.