పలాస దర్శకుడికి మెగా ఆఫర్

మూడేళ్ళ క్రితం వచ్చిన పలాస 1978తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్ మళ్ళీ ఆ స్థాయి సినిమా చేయలేదు. వెబ్ మూవీ మెట్రో కథలు నిరాశ పరచగా సుధీర్ బాబుతో చేసిన శ్రీదేవి సోడా సెంటర్ భారీ అంచనాల మధ్య ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. తక్కువ బడ్జెట్ తో తీసిన కళాపురం సైతం తీవ్రంగా నిరాశపరిచింది. అయినా సరే మెగా ఆఫర్ వరించడం అంటే మాటలు కాదు. వరుణ్ హీరోగా విజేందర్ రెడ్డి-మోహన్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించబోయే భారీ బడ్జెట్ చిత్రం కరుణ కుమార్ చేతికి వచ్చింది. వచ్చే వారం ప్రారంభించబోతున్నారు.

ఏడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకుని కరుణ కుమార్ ఈ వరుణ్ తేజ్ 14ని ప్లాన్ చేసుకున్నారు. బ్యాక్ డ్రాప్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గని డిజాస్టర్ తర్వాత వరుణ్ ఆశలన్నీ వచ్చే నెల 25న విడుదల కాబోతున్న గాండీవధారి అర్జున మీదే ఉన్నాయి. స్క్రిప్ట్ ల విషయంలో తాను వేస్తున్న తప్పటడుగులను తొందరగానే గుర్తించి రెగ్యులర్ కథలకు నో చెబుతున్నాడు. ఈ క్రమంలోనే కరుణ కుమార్ చెప్పిన లైన్ చాలా డిఫరెంట్ గా అనిపించడంతో పాటు  మంచి బ్రేక్ ఇచ్చేలా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా కరుణ కుమార్ కు ఇంత పెద్ద అవకాశం రావడం విశేషమే. పలాసలో తన పనితనం తాలూకు ప్రభావం ఆ స్థాయిలో ఉంది. తనకు పట్టున్న జానర్ ని వదిలేసి ఇతర ప్రయోగాలకు రావడం వల్ల దెబ్బ తిన్నట్టు గుర్తించిన ఈ దర్శకుడు ఇప్పుడీ ఛాన్స్ ని సరిగ్గా వాడుకుని బ్లాక్ బస్టర్ కొడితే మెయిన్ లీగ్ లోకి వచ్చేసి స్టార్ హీరోలను పట్టొచ్చు. వచ్చే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి 2024 వేసవిలో రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. అప్పటికి ఉన్న పోటీ పరిస్థితులను విశ్లేషించుకున్నాక విడుదల తేదీని ఫైనల్ చేయబోతున్నారు.