మీమ్స్‌కి మళ్లీ కంటెంట్ ఇచ్చిన నిర్మాత

ఒక సాధారణ మెగా అభిమానిగా ప్రయాణం మొదలుపెట్టి.. ఆ తర్వాత పీఆర్వో అవతారం ఎత్తి.. ఆపై నిర్మాత కూడా అయిపోయాడు శ్రీనివాస్ కుమార్ అలియాస్ ఎస్కేఎన్. మెగా హీరోలకు వీరాభిమానిగా.. పీఆర్వోగా సోషల్ మీడియాలో ముందు నుంచే ఎస్కేన్ బాగా పాపులర్. నిర్మాత అయ్యాక అతను ఇంకా పాపులారిటీ సంపాదించాడు. తన సినిమాలకైనా.. మెగా హీరోలకు సంబంధించి వేరే చిత్రాలకైనానా.. ఏవైనా వేడుకలు నిర్వహించినపుడు ఎస్కేఎన్ మైక్ అందుకున్నాడంటే మెరుపులు మెరవాల్సిందే.

సోషల్ మీడియా దృష్టిని ఎలా ఆకర్షించాలో బాగా తెలిసిన ఎస్కేఎన్ చాలా సరదాగా. కొంచెం సెన్సేషనల్‌గా పంచ్ డైలాగులు పేల్చి టాక్ ఆఫ్ ద ఈవెంట్ అవుతుంటాడు. అతను నిర్మాణ భాగస్వామిగా ఉన్న ‘బేబి’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఎలా సంచలనం రేపుతోందో తెలిసిందే.

ఈ సినిమా ప్రిమియర్స్ అయ్యాక యూత్‌కి కల్ట్ బొమ్మ ఇచ్చాం అంటూ తొడగొట్టి మైక్ విసిరేసినట్లుగా కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాను కొన్ని రోజులుగా ఊపేస్తోంది. దాని మీద బోలెడు మీమ్స్ వచ్చాయి గత వారం రోజుల్లో. ఈ సినిమా సక్సెస్ మీట్లో కూడా అందులో ఒక మీమ్‌ను ప్రదర్శించడం అందరినీ నవ్వించింది. ఈ వేడి ఇంకా తగ్గకముందే ఇప్పుడిక సోషల్ మీడియాకు మళ్లీ కంటెంట్ ఇచ్చేశాడు ఎస్కేఎన్.

అల్లు అర్జున్‌కు ‘బేబి’ సినిమా బాగా నచ్చిన నేపథ్యంలో చిత్ర బృందాన్ని అభినందించేందుకు ప్రత్యేకంగా ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. అందులో ఎస్కేఎన్ మాట్లాడుతూ.. తన తొలి చిత్రం తీసినపుడు స్టీఫెన్ స్పీల్ బర్గ్ కూడా తన పదో సినిమాగా ‘ఇంటర్ స్టెల్లార్’ లాంటిదితీస్తానని ఊహించి ఉండడని పేర్కొన్నాడు. ఐతే ‘ఇంటర్ స్టెల్లార్’ తీసింది క్రిస్టోఫర్ నోలన్ కాగా.. ఎస్కేఎన్ తడబడి స్పీల్‌బర్గ్ పేరు చెప్పాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోయింది. దీన్ని అనుకరిస్తూ.. కౌంటర్లు వేస్తూ అప్పుడే మీమర్స్ ఫన్నీ పోస్టులు రెడీ చేసి వదిలేస్తున్నారు.