ఈగ విలన్ చుట్టూ కొత్త వివాదం

రాజమౌళి తీసిన ఈగ విలన్ గా మనకు బాగా సుపరిచితుడైన కిచ్చ సుదీప్ ఆ తర్వాత బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటివి చేశాడు కానీ డెబ్యూ తెచ్చిన పేరు ఇంకేవి ఇవ్వలేదు. ఆ ఇమేజ్ వల్లే విక్రాంత్ రోనా తెలుగు రాష్ట్రాల్లోనూ బాగానే ఆడింది. మంచి స్టయిలిష్ హీరోగా శాండల్ వుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుదీప్ చుట్టూ ఓ వివాదం హాట్ టాపిక్ గా మారింది. కొద్దీ రోజుల క్రితం ఎంఎన్ కుమార్ అనే నిర్మాత బహిరంగ విమర్శలు చేస్తూ తనదగ్గర ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్న సుదీప్ ఇప్పటిదాకా డేట్లు ఇవ్వకుండా సతాయించాడని ఏకంగా మీడియాకెక్కడం సంచలనం రేపింది

దీంతో సీరియస్ గా స్పందించిన సుదీప్ ఈ ఆరోపణలు సత్య దూరమని, వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకుంటానని న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు. దీనికి నిరసనగా సదరు కుమార్ బెంగళూరు ఫిలిం ఛాంబర్ ముందు గత నలభై ఎనిమిది గంటలుగా ధర్నా చేపట్టాడు. కొందరితో మొదలైన ఈ ప్రొటెస్ట్ క్రమంగా ఇరవై మంది దాకా మద్దతు కూడగట్టుకుంది. వాళ్లలో సారా గోవింద్ లాంటి ప్రముఖులున్నారు. తలుచుకుంటే పది నిమిషాల్లో పరిష్కారం చేయగలిగిన సమస్యని  సుదీప్ సాగదీస్తున్నాడని వాళ్ళ ఆరోపణ. ఈగ విలన్ మాత్రం ఇవేవి పట్టించుకునే మూడ్ లో లేడు.

దెబ్బకు ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ ఇష్యూలో నిజమేవరిదో ఇంకా తేలనప్పటికీ వాతావరణం వేడెక్కుతోంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాత్రం మౌనం వహిస్తోంది. దీనికి తోడు సుదీప్ నిన్న రాత్రి రాజస్థాన్ రాయల్స్ టీమ్ సభ్యులకు పార్టీ ఇవ్వడం, ఆ ఫోటోలు వైరల్ కావడం అగ్నికి మరింత ఆజ్యం పోసింది. సుదీప్ ఇటీవలే రాజకీయంగా యాక్టివ్ కావడం వల్లే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారని అభిమానులు గుర్రుమంటున్నారు. సినిమాను తలపిస్తున్న ఈ కథకు క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో మరి