అనిల్ సుంకర ప్రీమియర్ సెంటిమెంట్

ఎల్లుండి విడుదల కాబోతున్న హిడింబ మీద భారీ అంచనాలేం లేవు కానీ టీమ్ మాత్రం మౌత్ టాక్ నుంచే అనూహ్యంగా పుంజుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తోంది. సాధారణంగా ఇలాంటి సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత చెప్పుకునేలా ఉండవు. అందుకే సమర్పకుడు అనిల్ సుంకర తనకు అచ్చి వచ్చిన ప్రీమియర్ సెంటిమెంట్ కి ఓటేశారు. సామజవరగమనకు బజ్ లేని టైంలో రెండు రోజుల ముందే తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రాల్లో స్పెషల్ షోలు వేయడం చాలా హెల్ప్ అయ్యింది. దాని టాక్ సోషల్ మీడియా ద్వారా ఓపెనింగ్స్ కి దోహదపడింది

ఇప్పుడు హిడింబకు అదే ఫాలో అవుతున్నారు. ఇవాళ సాయంత్రమే పలు చోట్ల ప్రీమియర్లను వేస్తున్నారు. వైజాగ్, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాల్లో 7 గంటలకు ప్రారంభమయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఖచ్చితంగా మెప్పిస్తుందనే ధీమా టీమ్ లో కనిపిస్తోంది. ఆ కారణంగానే ఇంత ముందుగా స్క్రీనింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పైగా అనిల్ సుంకర సైతం ఇది సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు కాబోలు కొంత రిస్క్ ఉన్నా సరే ఎస్ అన్నారు.

ఒకరకంగా ఇది మంచి ఎత్తుగడే. ఎందుకంటే 21న పోటీ గట్టిగానే ఉంది. దూసుకుపోతున్న బేబీ రెండో వారంలోనూ తగ్గేలా లేదు. హాలీవుడ్ మూవీ ఓపెన్  హెయిమర్ కోసం అర్బన్ ఆడియన్స్ ఎగబడుతున్నారు. అన్నపూర్ణ ఫోటో స్టూడియో కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుంది. విజయ్ ఆంటోనీ హత్యకు హడావిడి లేకపోయినా స్లో పాయిజన్ లా ఎక్కొచ్చని నిర్మాతల నమ్మకం. ఇవి కాకుండా మరో నాలుగైదు చిన్న చిత్రాలున్నాయి. ఇంత కాంపిటేషన్ ఉన్నప్పుడు ప్రీమియర్లకు వెళ్లడం మంచిదే. నిన్న వచ్చిన రివర్స్ ట్రైలర్ కూడా బాగానే రెస్పాన్స్ తెచ్చుకుంది.