సెన్సేషనల్ హీరోయిన్.. తొలి పారితోషకం 700

వైష్ణవి చైతన్య.. ఇప్పుడు టాలీవుడ్లో ఈ అమ్మాయి పేరు హాట్ టాపిక్. ‘బేబి’ సినిమాలో తన పెర్ఫామెన్స్ అందరికీ పెద్ద షాక్. కథానాయికగా తొలి సినిమాలో ఆమె తన పాత్రలో చూపించిన వేరియేషన్లు.. తన బోల్డ్ యాక్ట్స్.. కొన్ని ఎపిసోడ్లలో నటన ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. ఒక తెలుగు హీరోయిన్ లీడ్ రోల్ చేసిన తొలి చిత్రంలో ఇచ్చిన బెస్ట్ పెర్ఫామెన్స్‌ల్లో ఇదొకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

ఐతే ఫీచర్ ఫిలిమ్స్ మాత్రమే చూసేవాళ్లకు వైష్ణవి కొత్త కావచ్చు కానీ.. టిక్ టాక్‌ను అనుసరించిన వాళ్లకు.. యూట్యూబ్ షార్ట్స్ చూసేవాళ్లకు ఆమె కొత్త కాదు. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌’ చూసిన వాళ్లు ఆమెతో బాగా కనెక్ట్ అయ్యారు. ‘అల వైకుంఠపురములో’లో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రను కూడా పోషించింది వైష్ణవి. ఐతే ఆమెకు తొలిసారి గుర్తింపు వచ్చింది మాత్రం టిక్ టాక్ వీడియోలతోనే.

అలా సంపాదించిన గుర్తింపుతో కెరీర్ ఆరంభించిన తాను అందుకున్న తొలి పారితోషకం కేవలం ఏడొందలు అని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక ఈవెంట్ కోసం డ్యాన్స్ చేసే అవకాశం రాగా.. రోజంతా చాలా కష్టపడి డ్యాన్స్ చేస్తే.. ఏడొందల రూపాయలు ఇచ్చారని.. కానీ ఇప్పుడు ఎంత సంపాదించినా ఆ ఏడొందలే తనకు చాలా స్పెషల్ అని వైష్ణవి వెల్లడించింది.

‘బేబి’ సినిమాలో తన పాత్రకు వస్తున్న గుర్తింపు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పిన ఆమె.. ఇందులో లిప్ లాక్, ఇతర రొమాంటిక్ సీన్ల విషయంలో తన ఫ్యామిలీ ఎలా స్పందించిందనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఆ సీన్లు చేస్తున్నపుడు టీం అంతా తనను చాలా కంఫర్ట్‌గా ఉంచిందని.. సినిమా అంతా చూసేసరికి ఎవరికీ ఆ సీన్ గుర్తుండదని.. ప్రేక్షకుల్లాగే తన కుటుంబ సభ్యుల్లాగే దాన్ని పెద్ద విషయం లాగా చూడలేదని వైష్ణవి పేర్కొంది.