టాలీవుడ్ సోనూసూద్ గా బండ్ల గణేష్

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాల కడగండ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. పిల్లా జెల్లాతోపాటు తట్టా బుట్టా నెత్తినబెట్టుకొని వందల కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ సొంతూళ్లకు పయనమైన వారి దయనీయ స్థితి ఎందరినో కన్నీళ్లు పెట్టించింది. అటువంటి వారికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరో తమకు తోచిన సాయం చేశారు. అయితే, వారందరిలోకెల్లా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. వలస కూలీల పాలిట ఈ బాలీవుడ్ విలన్ హీరో అయ్యాడు. వలస కూలీలకు బస్సులు ఏర్పాటు చేయడం మొదలు విమానాల్లో వారిని తరలించడం వరకు ఎన్నో రకాలుగా సాయం చేసి తన దయాగుణాన్ని చాటుకున్నాడు. ఇప్పటికీ సాయం కోరిన వారికి సోనూ సూద్ తన ఆపన్న హస్తం అందిస్తూనే ఉన్నాడు. తాజాగా సోనూ సూద్ తరహాలోనే టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా అవసరం అన్న వారికి సాయం చేస్తున్నారు.

తనను సాయం అడిగినవాళ్లకు కాదనకుండా ఏదో ఒక రూపంలో సాయం చేస్తున్నారు. కొందరికి ఉద్యోగాలిప్పించిన బండ్ల గణేష్…మరి కొందరికి తోచిన ఆర్థిక సాయం చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. మణికాంత్ అనే కుర్రాడు ఇంటర్ చదివానని, కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందువల్ల ఉద్యోగం చేయాలనుకుంటున్నానని బండ్ల గణేశ్ కు ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన బండ్ల గణేష్…ఓ సంస్థ ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ తన పేరు చెబితే ఉద్యోగం ఇస్తారని చెప్పారు. అదే తరహాలో…ఎంబీఏ ఫైనాన్స్ చదివిన మరో యువకుడికి ఫోన్ నెంబర్ ఉద్యోగానికి సిఫారసు చేశారు. నిరుద్యోగంతో కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధపడిన మరో యువకుడికి విద్యార్హతలను బట్టి ఉద్యోగం ఇప్పిస్తానని బండ్ల గణేశ్ భరోసా ఇచ్చారు. వీరితోపాటు, కరోనా సోకిన ఓ రిపోర్టర్ కు ఫోన్ పే ద్వారా ఆర్థికసాయం అందించారు. ఇలా, సోషల్ మీడియా ద్వారా బండ్ల గణేష్…తన సాయం అడిగిన వారికి ఆపన్న హస్తం అందిస్తూ టాలీవుడ్ సోనూ సూద్ గా మారుతున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.