కోట్లు ఖర్చు పెట్టిన పాటకు రీ షూట్

ఒకసారి ఏదైనా షెడ్యూల్ కానీ పాట కానీ చిత్రీకరణ జరిపాక మళ్ళీ రీ షూట్ చేయడానికి స్టార్ హీరోలు అంతగా ఇష్టపడరు. ఒకవేళ సన్నివేశాలు మరీ పేలవంగా వచ్చాయనిపించినా లేదా దర్శకుడి నెరేషన్ కు తగ్గట్టు లేదని ఫీలైనా అప్పుడు ఓకే అంటారు. కానీ సాంగ్స్ విషయంలో రిస్కులు తీసుకోరు. కానీ జవాన్ కోసం షారుఖ్ ఖాన్ అలాంటి లెక్కలేవీ వేసుకోవడం లేదు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా తాలూకు ట్రైలర్ నిన్న యూట్యూబ్ లో రిలీజై బ్రహ్మాండమైన స్పందన దక్కించుకుంది. అన్ని ప్లాట్  ఫార్స్ కలిపి వంద మిలియన్ల వ్యూస్ దాటేసింది.

నెలల క్రితమే షారుఖ్ దీపికా పదుకునేల మీద సీనియర్ డాన్స్ మాస్టర్ ఫరా ఖాన్ నేతృత్వంలో ఒక భారీ పాటను చిత్రీకరించారు. అయితే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న సాంగ్ కావడంతో దీన్ని ఆషామాషీగా తీయకూడదని గుర్తించి అట్లీ మళ్ళీ తీయాలని నిర్ణయించుకున్నాడు. అంతే ఫరా ఖాన్ తీసిన ఫుటేజ్ ని పక్కనపడేసి వైభవి మర్చంట్ ని రంగంలోకి దింపి మళ్ళీ ఫ్రెష్ గా తీస్తున్నారు. మొత్తం నాలుగు రోజుల పాటు ముంబైలో వేసిన ఖరీదైన సెట్లో వందలాది జూనియర్ ఆర్టిస్టులు, దేశ విదేశీ డాన్సర్లు, భారీ ఇంటీరియర్ల మధ్య గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు.

షారుఖ్ తో ఉన్న స్నేహం వల్ల ఫరా ఖాన్ ఏమీ అనలేక మిన్నకుండిపోయిందట. నిజానికి దీపికా పదుకునే ఇందులో హీరోయిన్ కాదు. స్పెషల్ క్యామియో చేసింది. అయినా సరే ఇంత ఖర్చు పెట్టి కొత్త కాల్ షీట్ తీసుకుని మరీ తీయడం చూస్తుంటే రెడ్ చిల్లీస్ సంస్థ ఏ దశలోనూ రాజీ పడేందుకు సిద్ధంగా లేదనిపిస్తోంది. పఠాన్ దెబ్బకు జవాన్ కు విపరీతమైన బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఒకటికి రెండింతలు ఆఫర్లు ఇస్తూ డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. ఇంతేసి హైప్ ఉన్నప్పుడు క్వాలిటీ మీద ఆ మాత్రం శ్రద్ధ తీసుకోవడం అవసరమే మరి.