బ్రో బిజినెస్ చుట్టూ రాజకీయ నీడలు

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ బ్రో విడుదల ఎంతో దూరంలో లేదు. ఇంకో పదిహేడు రోజులు లెక్క బెట్టేస్తే జూలై 28 రిలీజ్ డేట్ వచ్చేస్తుంది. అయితే ప్రమోషన్ పరంగా ఒక టీజర్, లిరికల్ వీడియో తప్ప ఎలాంటి హడావిడి కనిపించలేదు. బజ్ కూడా పవర్ స్టార్ రేంజ్ లో లేదని ఫాన్సే ఒప్పుకుంటున్నారు. వారాహి తాలూకు వీడియోలు వైరల్ అవుతూ జనసేన సందేశం పబ్లిక్ లోకి బలంగా వెళ్లడంతో అభిమానులు దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. దీంతో సహజంగానే బ్రో మీద కావాల్సిన అటెన్షన్ రావడం లేదు. ఇదో సమస్య అనుకుంటే మరో పెద్ద తలనెప్పి వచ్చి పడింది.

వంద కోట్లకు పైగా లక్ష్యంతో థియేట్రికల్ బిజినెస్ మొదలుపెట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఎగ్జిబిటర్ల నుంచి ఆ స్థాయి స్పందన రావడం లేదట. వాలంటీర్ల మీద వ్యాఖ్యలతో పాటు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద పవన్ చేస్తున్న తీవ్ర విమర్శలు అధికార పార్టీని అసహనానికి గురి చేస్తున్నాయి. దీంతో ఏపీలో బ్రో మొదటి రోజు తీవ్రమైన అడ్డంకులు తప్పవని  డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. అదే జరిగితే ప్రీమియర్ షోలు ఉండకపోవచ్చు. మాములు రేట్లకే టికెట్లు అమ్మాలని ఒత్తిడి రావొచ్చు. ఇదే జరిగితే నష్టాలు తప్పవు. టాక్ బాగుంటే ఇబ్బంది లేదు అలా కాకుంటే పెద్ద సమస్యే.

అందుకే హైర్ బేసిస్, మినిమమ్ గ్యారెంటీ పద్ధతి మీద కాకుండా రిటర్నబుల్ అడ్వాన్స్ కింద వీలైనంత తక్కువ మొత్తం బయ్యర్లు ఆఫర్ చేస్తున్నట్టుగా తెలిసింది. బ్లాక్ బస్టర్ అయితే పంపకాలు సహేతుకంగా జరిగేలా అగ్రిమెంట్ రాసుకుంటారు. ఒకవేళ ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోతే నిర్మాతకే నష్టం. ఇదింకా తేలిందో లేదో కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం పెద్ద చర్చకే దారి తీసింది. మాములుగా పవన్ సినిమా అంటేనే అదో సెలబ్రేషన్ లా ఫీలయ్యి ఎగబడి కొనే వాళ్ళు రాజకీయ పరిణామాల వల్ల అనూహ్య నిర్ణయాలకు వెళ్లడం కొత్త ట్విస్టు. ఇంకో రెండు మూడు రోజుల్లో పూర్తి క్లారిటీ రావొచ్చు