మాఫియాకు దూరంగా ఎన్టీఆర్ 31  

కెజిఎఫ్ తో పన్నెండు వందల కోట్ల సినిమాని శాండల్ వుడ్ కు ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న సలార్ మీద ఏ స్థాయిలో అంచనాలు పెట్టాడో చూస్తున్నాం. సెప్టెంబర్ 28 విడుదల కాబోతున్న ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ మీద భారీ ఎత్తున బిజినెస్ జరుగుతోంది. సెకండ్ పార్ట్ సమాంతరంగా పూర్తి చేశారనే టాక్ వినిపిస్తోంది నిజానికి సీక్వెల్ లోని కీలక భాగం డిసెంబర్  నుంచి మొదలుపెడతారట. దీని సంగతలా  ఉంచితే నీల్ దీని తర్వాత ఎన్టీఆర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే.  దీనికి సంబంధించిన స్టోరీ లీక్స్ ఇప్పటిదాకా బయటికి రాలేదు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈసారి ప్రశాంత్ నీల్ మాఫియా జోలికి పోవడం లేదట. ఇప్పటిదాకా తీసినవి నాలుగు అవే జానర్ కావడంతో పూర్తిగా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకోబోతున్నట్టు తెలిసింది. స్వాతంత్రం రాకముందు ఇండియా పాకిస్థాన్ సరిహద్దుల్లో జరిగిన పోరాటం ఆధారంగా ఒక కథను తయారు చేశారట. తారక్ వీర దేశభక్తుడిగా హై వోల్టేజ్ పాత్రను పోషించబోతున్నట్టు తెలిసింది. ఆర్ఆర్ఆర్ తరహాలో అనిపించినా అది కేవలం ఒక పాప చుట్టూ నడిచే డ్రామా కాబట్టి దీంతో ఎలాంటి పోలిక ఉండదని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఫోటో షూట్ చేయబోతున్నారు.

ఇది నిజమైతే అంతకన్నా శుభవార్త అభిమానులకు ఇంకేం ఉండదు. మాములుగా ప్రశాంత్ నీల్ హీరోయిజం ఓ రేంజ్ లో ఉంటుంది. దానికి దేశభక్తి తోడైతే ఎలా పేలుతుందో ఊహించుకోవడం కష్టం. ప్రస్తుతం దేవర కోసం డిసెంబర్ దాకా డేట్లు ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ లోగానే వార్ 2 కోసం హృతిక్ రోషన్ తో కలిసి సెట్లో అడుగుపెడతాడు. ఈ రెండు అయ్యేలోపు 2024 వేసవి దాటిపోతుంది. అప్పటికంతా సలార్ 2 ఫినిష్ చేసుకున్న ప్రశాంత్ చిన్న గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ 31కి ముహూర్తం పెట్టేస్తాడు. బడ్జెట్ కూడా ఊహించని షాకింగ్ ఫిగర్ తో ఉంటుందని ఫిలిం నగర్ టాక్