లైగర్ రోజు పొద్దునే విజయ్‌కి అర్థమైపోయిందట

గత కొన్నేళ్లలో టాలీవుడ్ నుంచి వచ్చిన అతి పెద్ద డిజాస్టర్లలో ‘లైగర్’ ఒకటి. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ని ఈ సినిమా పెద్ద రేంజికి తీసుకెళ్తుందనే అంచనాలు ఏర్పాడ్డాయి. ‘ఇస్మార్ట్ శంకర్’తో బలంగా బౌన్స్ బ్యాక్ అయిన సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్.. విజయ్ లాంటి ఎనర్జిటిక్ హీరోతో పెద్ద మాస్ హిట్ ఇస్తాడని అంతా అనుకున్నారు.

విడుదలకు ముందు ‘లైగర్’ టీం కాన్ఫిడెన్స్ కూడా మామూలుగా లేదు. విజయ్ అయితే ఈ సినిమా కలెక్షన్ల లెక్క రూ.200 కోట్ల నుంచి మొదలవుతుందని అన్నాడు. ఇలాంటి మాటలు, అగ్రెసివ్ ప్రమోషన్లతో పెరిగిపోయిన అంచనాలను సినిమా కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది. తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ ఈ సినిమా తర్వాత లేవలేదు.

ఐతే ‘లైగర్’ రిలీజ్ తర్వాత ఆ సినిమాను విజయ్ ప్రమోట్ చేయనేలేదు. అలాగే ఎక్కడా ఆ సినిమా గురించి మాట్లాడింది కూడా లేదు. ఐతే సినిమా ఫలితం అర్లీ మార్నింగ్ షోలతోనే తేలిపోవడంతో విజయ్ సైలెంట్ అయినట్లు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండొ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘‘లైగర్ రిజల్ట్ ఏంటో అర్లీ మార్నింగ్ షోలు అయ్యేసరికే అందరికీ అర్థం అయిపోయింది.

ఇంక ఈ సినిమాను మనం జనాల మీదికి రుద్దాలి అనే ఇంటెన్షన్‌ను అన్న పక్కన పెట్టేశాడు. శారీరకంగా, మానసికంగా మనం ఇంత కష్టపడ్డామే అని బాధ పడటం కూడా మానేసి.. ఆగస్టు 25 సాయంత్రం నుంచే ‘ఖుషి’ కోసం ప్రిపేరవడం మొదలుపెట్టాడు. అన్న సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తన ఎఫర్ట్స్ మీద ఎవరూ వేలెత్తి చూపలేరు’’ అని ఆనంద్ తెలిపాడు. ఆనంద్ ముఖ్య పాత్ర పోషించిన ‘బేబీ’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.