ప్రాజెక్ట్ K రాదనే ధీమాలో ఉన్నారా

సంక్రాంతికి ఇంకా ఆరు నెలల టైం ఉన్నప్పటికీ పండగ మీద కన్నేసిన బడా హీరోలు, ప్యాన్ ఇండియా సినిమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ముందు జాగ్రత్తగా కర్చీఫ్ లు వేసి తమ వైపు వేలెత్తి చూపకుండా జాగ్రత్త పడుతున్నారు. గుంటూరు కారం ఎన్ని బ్రేకులు పడుతున్నా సరే ఆ సీజన్ ని వదిలే ప్రసక్తే లేదనే తరహాలో ప్లాన్ చేసుకుంటోంది. ఆగస్ట్ నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్స్ చేయబోతున్నారు. ఇది మిస్ అయితే మళ్ళీ వేసవి దాకా ఎదురు చూడటం కష్టం కాబట్టి ఆరు నూరైనా సరే మహేష్ బాబు రావడం పక్కానే.

మాస్ మహారాజా రవితేజ ఈగల్ కొద్దిరోజుల క్రితమే నేనూ ఫెస్టివల్ కేనని తేల్చి చెప్పేసింది. ఇంకా షూటింగ్ మొదలేకాని చిరంజీవి – దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మూవీ విడుదలకు పొంగల్ ముహుర్తాన్నే లాక్ చేశారని ఇన్ సైడ్ టాక్.మరోవైపు ప్రశాంత్ వర్మ హనుమాన్ కూడా తగ్గేదేలే అంటూ పండగ బరిలో దిగుతోందని టాక్. ఇవాళ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎప్పుడో జనవరి 12ని పోస్టర్ తో సహా ప్రకటించిన ప్రాజెక్ట్ కెని వీళ్ళందరూ ఎందుకు లైట్ తీసుకుంటున్నారనే అనుమానం ప్రభాస్ అభిమానుల్లో తీవ్రంగా ఉన్న మాట వాస్తవం.

అయితే పైన చెప్పిన సినిమాల నిర్మాతలందరూ ప్రాజెక్ట్ కె వాయిదా తప్పదనే ధీమాలో ఉన్నారని వినికిడి. ఇంకా చాలా వర్క్ బ్యాలన్స్ ఉంది కాబట్టి చెప్పిన టైంలో పూర్తవ్వదని ఫిక్స్ అయ్యారట. వైజయంతి టీమ్ మాత్రం కన్ఫర్మ్ గా వస్తామని ప్రైవేట్ గా అడిగిన మీడియా ప్రతినిధులతో నొక్కి వక్కాణిస్తున్నారు. రెండు భాగాలు కాబట్టి మొదటిది సంక్రాంతికి విడుదల చేసి సీక్వెల్ 2025కి ప్లాన్ చేశారట. అధికారికంగా టూ పార్ట్స్ అని చెప్పకపోయినా దర్శకుడు నాగ అశ్విన్ ఏదైనా ప్రత్యేక సందర్భంలో దీన్ని రివీల్ చేస్తారని తెలిసింది. మొత్తానికి సంక్రాంతి రేసు మహా రసవత్తరంగా మారేలా ఉంది.