మల్టీస్టారర్ కాదు.. అంతకుమించి

ఒకప్పుడు బాలీవుడ్లో మాత్రమే ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కేవి. దక్షిణాదిన మాత్రం స్టార్ హీరోల మధ్య ఇగో అడ్డు వస్తుందనో.. లేదా లెక్కలేసుకుని సినిమాలు చూసే అభిమానులను తట్టుకోవడం కష్టమనో.. మరో కారణంతోనో మల్టీస్టారర్ సినిమాలు చాలా ఏళ్ల పాటు ఆగిపోయాయి. కానీ కొన్నేళ్ల నుంచి పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. అసాధ్యం అనుకున్న కలయికలన్నీ సాధ్యం అవుతున్నాయి.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో మహేష్ బాబు, వెంకటేష్.. ‘గోపాల గోపాల’లో పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించి మల్టీస్టారర్ ట్రెండు ఊపందుకునేలా చేశారు.  ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించి మెప్పించాక.. ఇలాంటి ఆసక్తికర కలయికలు మరిన్ని రావడానికి మార్గం సుగమమైంది. ఐతే తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన మల్టీస్టారర్లన్నీ ఒకెత్తయితే.. ‘ప్రాజెక్ట్-కే’ మరో ఎత్తు అని చెప్పాల్సిందే. దీన్ని మల్టీస్టారర్‌ కా బాప్ అనో.. మెగా మల్టీస్టారర్ అనో అనాలి.

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనేలా కలయికకే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు వారెవా అనుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌ల కలయిక అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పుడు లెజెండరీ నటుడు కమల్ హాసన్ కూడా వీరికి తోడయ్యారు. కమల్‌ను కేవలం తమిళ నటుడిగా చూడలేం. తెలుగులో, హిందీలో కూడా ఆయనకు గొప్ప పేరుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

‘విక్రమ్’తో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాక ఆయన మళ్లీ మాంచి క్రేజ్ సంపాదించారు. ‘ఇండియన్-2’ లాంటి మెగా మూవీ చేస్తూ.. ఇప్పుడు ‘ప్రాజెక్ట్-కే’లో భాగం కావడంతో ఈ ప్రాజెక్టు రేంజే మారిపోయింది. ప్రభాస్, అమితాబ్, కమల్.. ఈ ముగ్గురినీ ఒక్క సినిమాలో చూస్తామని ఎవ్వరూ ఊహించి ఉండరు.

ఈ సినిమా చూసి తీరాల్సిందే అనేందుకు కమల్ రూపంలో మరో బలమైన కారణం దొరికింది. మామూలు పాత్ర అయితే కమల్ ఒప్పుకుని ఉండరు కాబట్టి.. ఆయన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆశించవచ్చు. మరి ఈ ముగ్గురినీ తెర మీద నాగ్ అశ్విన్ ఎలా ఉపయోగించుకుంటాడు.. వారి పాత్రలను ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అన్నది ఆసక్తికరం. మొత్తానికి వచ్చే ఏడాది ‘ప్రాజెక్ట్-కే’ ప్రపంచ స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.