వ్యూహం.. ప్లస్సా మైనస్సా?

రామ్ గోపాల్ వర్మ నుంచి కొంచెం గ్యాప్ తర్వాత ఓ సినిమా రాబోతోంది. అదే.. వ్యూహం. ఒకప్పుడు కల్ట్ మూవీస్ తీసిన వర్మ.. గత దశాబ్ద కాలంలో ఎంత నాసిరకం సినిమాలు తీశాడో తెలిసిందే. ఒక టైంలో అమ్మాయిల అందాలనే పెట్టుబడిగా పెట్టి సెమీ పోర్న్ సినిమాలు చేసి అమ్ముకున్న వర్మ.. అవి కూడా వర్కవుట్ కాని దశ వచ్చేశాక.. పెయిడ్ పొలిటికల్ సినిమాల వైపు మళ్లాడు.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నేతల సహకారంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసి కొంతమేర ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చిన ఆయన.. గత ఏడాది కొండా మురళి, సురేఖలకు ఎలివేషన్ ఇస్తూ ‘కొండా’ అనే సినిమా చేశారు. కానీ ‘కొండా’ చేసే సమయానికి వర్మ క్రెడిబిలిటీ దారుణంగా దెబ్బ తినడంతో దానికి కనీస స్పందన కూడా కరవైంది. అయినా వర్మ వెనక్కి తగ్గట్లేదు. కొంత కాలంగా ఆయన వైసీపీకి మద్దతుదారుగా మారి పోస్టులు పెడుతుండటం, వీడియోలు చేస్తుండటం తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పుడు జగన్ అండ్ కోకు మేలు చేసేలా.. చంద్రబాబును డ్యామేజ్ చేసేలా ‘వ్యూహం’ అనే సినిమాకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ రోజే దాని టీజర్ రిలీజైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం దగ్గర మొదలుపెట్టి.. ఆ టైంలో జగన్, ఆయన కుటుంబం, వైఎస్ అభిమానులు పడ్డ బాధను.. అలాగే జగన్ ఎదుర్కొన్న కష్టాలను.. చివరగా రాజకీయంగా ఆయన ఎదిగిన వైనాన్ని ఇందులో చూపించబోతున్నారు.

ఐతే వైఎస్ అభిమానుల్లో భావోద్వేగాలను రేకెత్తించి వైసీపీకి ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన ఓకే కానీ.. టీజర్లో చూపించిన అంశాలైతే మరీ నాటకీయంగా, ఏకపక్షంగా అనిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేసే సినిమాల్లో చెప్పాలనుకున్న విషయాలను అంతర్లీనంగా చెప్పాలి.. వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకు ‘యాత్ర’ సినిమా ఉదాహరణ. కానీ ‘వ్యూహం’ పూర్తిగా ఒక ప్రాపగండా ఫిలిం లాగా ఉంది. వైసీపీకి ఊపున్నపుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లాంటి సినిమాలు కొంత వర్కవుట్ అయ్యాయేమో కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా వర్మ క్రెడిబిలిటీ పూర్తిగా అడుగంటిపోయింది. ‘వ్యూహం’ టీజర్ చూస్తే.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ను మించిన క్రింజ్ మూవీలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీకి ‘వ్యూహం’ సినిమా ప్లస్ అవుతుందా.. లేక మైనస్ అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.