అసలేం జరుగుతోంది త్రివిక్రమ్ గారూ

నిన్న సాయంత్రం నుంచి హఠాత్తుగా రెండు వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయ్యాయి. మొదటిది గుంటూరు కారం నుంచి తమన్ ని మారుస్తున్నారని. ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా అనిరుద్ రవిచందర్ లేదా జివి ప్రకాష్ కుమార్ ఇద్దరిలో ఒకరిని తీసుకోవడం ఖాయమని ట్విట్టర్ లో ఒకటే హోరెత్తించారు. రెండోది అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతి త్వరలో ఒక ప్యాన్ ఇండియా మూవీ ప్రారంభం కాబోతోందని. నిర్మాత నాగవంశీ దీనికి సంబంధించిన క్లూని ట్వీట్ చేశారు తప్పించి ఎవరి కలయికో మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

మరోవైపు తమన్ తనను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్న వాళ్లకు సమాధానంగా అరటిపళ్ళు, మజ్జిగ ఫోటోలు పెడుతూ వ్యంగ్యాస్త్రాలు వేశాడు తప్ప గుంటూరు కారంలో ఉన్నదీ లేనిదీ చెప్పలేదు. ఇవన్నీ చూస్తూ మహేష్ ఫ్యాన్స్ అయోమయపడుతున్నారు. త్రివిక్రమ్ ముందు నుంచి తమ హీరో మూవీ పట్ల సీరియస్ గా లేడని వాళ్ళ ప్రధాన ఆరోపణ. బ్రో స్క్రిప్ట్ ని స్వయంగా రాసివ్వడం, ఆహా ప్రకటన కోసం బన్నీ శ్రీలీలతో యాడ్ ని డైరెక్ట్ చేయడం,  పవన్ కు సంబంధించి సినిమా వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవడం వల్లే గుంటూరు కారం విపరీతమైన ఆలస్యం జరుగుతోందని అంటున్నారు.

నిజానికి బన్నీతో ప్రాజెక్టుని ఇప్పటికిప్పుడు అంత అర్జెంట్ గా అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది. గుంటూరు కారం ఒక కొలిక్కి వచ్చాక అప్పుడు నెక్స్ట్ అని చెబితే బాగుంటుంది కానీ ఇలాంటి కీలకమైన స్టేజిలో ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఆడియన్స్ కి వేరే సంకేతాలు వెళ్లే అవకాశముంది. పైగా తమన్ ని రీప్లేస్ చేయాలనుకుంటే అదేదో త్వరగా తేల్చేస్తే మంచిది. నానిస్తేనే ఎక్కువ నష్టం. జూనియర్ ఎన్టీఆర్ ది డ్రాప్ చేసుకుని మహేష్ వైపు వచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు హఠాత్తుగా బన్నీ వైపు మొగ్గు చూపడం లేనిపోని ఊహాగానాలకు తెరతీస్తోంది. వీటికి త్వరగా చెక్ పెట్టడం అత్యవసరం