రిలీజ్ తర్వాత ఓం రౌత్ ఫస్ట్ ట్వీట్


టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ల కాంబినేషన్లో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆది పురుష చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రంపై డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. మరోవైపు, రామాయణ ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక, మరికొందరైతే… ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తూ ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇక, సోషల్ మీడియాలో కొందరు ప్రభాస్ అభిమానులు…చిత్ర దర్శకుడు ఓం రౌత్ పై  సోషల్ మీడియాలో కొంతమంది విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు, ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద 140 కోట్లు వసూలు చేసిందని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం విడుదలైన తర్వాత దర్శకుడు ఓం రౌత్ తొలిసారిగా స్పందించారు. ఆది పురుష్  ప్రదర్శితమవుతున్న థియేటర్లలో హనుమంతుడి కోసం వదిలిపెట్టిన సీట్ల ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు. జై శ్రీరామ్ అంటూ ట్వీట్ మొదలుపెట్టిన ఓం రౌత్…దేశంలోని అన్ని థియేటర్లు భక్తితో నిండిపోయాయని అన్నారు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై మాత్రం ఆయన స్పందించకపోవడం విశేషం.