బాలయ్య 109.. ఎవరి కోరిక వాళ్లది

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మామూలు ఊపులో లేడు. ‘అఖండ’కు ముందు వరుస డిజాస్టర్లతో ఆయన కెరీర్లో పతనాన్ని చూశాడు. అలాంటి స్థితి నుంచి ఊహించని స్థాయిలో రైజ్ అయ్యాడు. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ కావడం.. ‘వీరసింహారెడ్డి’ కూడా హిట్టవడం.. బాలయ్య కొత్త చిత్రం ‘భగవంత్ కేసరి’కి కూడా మంచి హైప్ రావడంతో నందమూరి అభిమానుల ఉత్సాహం మామలుగా లేదు.

‘భగవంత్ కేసరి’ టీజర్ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతున్న సమయంలోనే బాలయ్య కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ కొల్లి దర్శకత్వంలో బాలయ్య కొత్త చిత్రం చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇంట్రెస్టింగ్ ప్రి లుక్ పోస్టర్‌తో ఈ చిత్రం ఆరంభంలోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. 

ఐతే ఈ పోస్టర్లో సంగీత దర్శకుడి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. సినిమాను అనౌన్స్‌ చేసినపుడు ముందు ప్రకటించే పేర్లలో మ్యూజిక్ డైరెక్టర్‌ది ఒకటి. కానీ ఈ సినిమాకు ఇంకా సంగీత దర్శకుడు ఖరారవ్వలేదు. చిత్ర బృందం ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడమే కారణమని అంటున్నారు. ఈ సినిమాకు ఎవరు సంగీతం అందిస్తే బాగుంటుందనే విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్లదిగా కనిపిస్తోంది.

బాలయ్య అభిమానులైతే తమన్‌కే ఓటు వేస్తున్నారు. ‘అఖండ’ నుంచి నందమూరి అభిమానులకు తమన్ మామూలు కిక్ ఇవ్వట్లేదు. ‘వీరసింహారెడ్డి’లోనూ ఆర్ఆర్‌తో బాలయ్యకు మాంచి ఎలివేషన్ ఇచ్చాడు తమన్. ‘భగవంత్ కేసరి’ టీజర్‌కు కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. దీంతో అతనే కావాలని అభిమానులు అంటున్నారు. ఐతే దర్శకుడు బాబీకి మాత్రం దేవిశ్రీ ప్రసాద్‌ మీద గురి ఉంది. అతడి కెరీర్లో మెజారిటీ సినిమాలకు తనే మ్యూజిక్ చేశాడు.

మరోవైపు సితార అధినేత నాగవంశీకి మాత్రం అనిరుధ్ వైపు మనసు మళ్లుతున్నట్లు సమాచారం. బాలయ్యకు, అనిరుధ్‌కు సెట్ అవుతుందా అనే సందేహాలున్నాయి కానీ.. అతను మ్యూజిక్ చేస్తే సర్ప్రైజింగ్‌గా ఉంటుందని.. బాలయ్యను స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయాలంటే.. సినిమాకు వైవిధ్యం చేకూరాలంటే అనిరుధే కరెక్ట్ అని నాగవంశీ భావిస్తున్నాడట. మరి చివరికి ఈ చిత్రానికి ఎవరు సంగీత దర్శకుడిగా ఖరారవుతారో చూడాలి.