IMAX వెర్షన్ ఎందుకు లేదంటే

ఇంకో ఆరే రోజుల్లో ఆదిపురుష్ విడుదల కాబోతోంది. ఈ రోజు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. రికార్డు స్థాయి ఓపెనింగ్స్ గురించి ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. వంద కోట్లా లేక అంతకు మించి వస్తుందా అనేది ట్రేడ్ ఊహలకు అందటం లేదు. తెలుగు కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా జై శ్రీరామ్ నినాదం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి స్టేట్స్ ని జ్వరంలా పట్టేసుకుంది. మూడు గంటల నిడివి ఉన్న ఆదిపురుష్ కి మొదటిరోజు వీలైనన్ని ఎక్కువ షోలు వేసుకునేలా థియేటర్ల యాజమాన్యాలు ప్లాన్ చేసుకుంటున్నాయి

ఇలాంటి విజువల్ గ్రాండియర్ ని ఐమ్యాక్స్ తెరమీద చూస్తే దాని కిక్కు వేరుగా ఉంటుంది. కానీ టి సిరీస్ సంస్థ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కారణం ఆ స్క్రీన్లన్నీ హాలీవుడ్ మూవీ ఫ్లాష్ కోసం ఎప్పుడో బ్లాక్ చేశారట. ఐమాక్స్ నిబంధనల ప్రకారం ఒకే సమయంలో రెండు సినిమాలు ఆ ఫార్మాట్ లో వేయడానికి సాధ్యపడదు. నిజానికి ఆదిపురుష్ ముందు అనుకున్న తేదీ 2023 సంక్రాంతి. దానికి అనుగుణంగానే అప్పటి పోస్టర్లలో ఐమాక్స్ లోగోతో పాటు ప్రమోషన్లు చేశారు కానీ ఊహించని విధంగా పోస్ట్ పోన్ కావడంతో ఐమాక్స్ స్క్రీన్లు చేజారిపోయాయి

తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ కి పెద్దగా ఫరక్ పడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ లేదు. హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నది, సూళ్లూరుపేటలో యువి వాళ్ళు స్థాపించింది పెద్ద తెరలే కానీ వాటికి ఐమ్యాక్స్ ప్రొజెక్షన్ ఉండదు. బెంగళూరు, ముంబై, చెన్నై, కోచి లాంటి నగరాల్లో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడ ది ఫ్లాష్ స్క్రీనింగ్ ఉంటుంది. సరే అది పోతే పోయింది కానీ సినిమా కనక బాగుంటే హ్యాపీగా త్రీడిలో ఎంజాయ్ చేయడానికి బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. 16న రఘురాముడి ఆగమనం కోసం అందరూ వెయిటింగ్ మరి