అందరూ బిజీ అయితే ఎలా బ్రో

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న బ్రో విడుదలకు ఇంకో నలభై రోజులు మాత్రమే టైం ఉంది.  పవర్ స్టార్ కు సంబంధించిన షూట్ పూర్తయ్యింది కానీ మిగిలిన క్యాస్టింగ్ తో ఇంకొంత టాకీ పార్ట్ బ్యాలన్స్ ఉంది. ఇంకో వారం పది రోజుల్లో పూర్తి చేయనున్నారు. అయితే జూలై 28 ఇంత దగ్గరగా ఉన్నా ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి కేవలం మూడు పోస్టర్లు తప్ప ఇంకెలాంటి పబ్లిసిటీ మెటీరియల్ బయటికి రాలేదు. టీజర్ సైతం వదల్లేదు. అసలు కట్ చేయించేంత టైం కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. దానికి కారణాలున్నాయి

దర్శకుడు సముతిరఖని తనే ప్రధాన పాత్ర పోషించిన విమానం విడుదల ఈ శుక్రవారం ఉండటంతో దాని ప్రమోషన్స్ లో కొంత బిజీ అయ్యారు. పవన్ ఓజి షూటింగ్ ని కొనగిస్తున్నారు. నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సిద్దార్థ్ టక్కర్ రిలీజ్ సందర్భంగా దీని మీద దృష్టి పెట్టింది. వీటికి తోడు ఆదిపురుష్ హక్కులను ఇదే బ్యానర్  కొనుగోలు చేయడంతో ఆ  బిజినెస్ వ్యవహారాలు కూడా దగ్గరుండి చూసుకోవాల్సి వస్తోంది. ఇలా ఎవరికి వారు టైట్ షెడ్యూల్స్ లో ఉంటే సాయి ధరమ్ తేజ్ మాత్రం ఏం చేస్తాడు. సంగీత దర్శకుడు తమన్ వైపు నుంచి ఎలాంటి సౌండ్ లేదు

ఎంత పవన్ మూవీ అయినా సరే బ్రో రీమేక్ కాబట్టి ప్రచారం హోరెత్తిపోతేనే ఓపెనింగ్స్ విషయంలో సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా ఆసక్తి మొదలవుతుంది. బ్రోకి ఇది చాలా అవసరం. ఎన్ని పాటలు ఉన్నాయో తెలియదు. పోనీ ఇతర క్యాస్టింగ్ ఇంటర్వ్యూలు గట్రా ఇస్తూ బయట కనిపిస్తున్నారా అంటే అదీ లేదు. ఫ్యాన్స్ కి ఎంతసేపూ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లే కనిపిస్తున్నాయి తప్ప బ్రో మీద అంతగా దృష్టి పెట్టడం లేదు. అది చేయాలంటే స్పీడ్ పెంచాలి. సముతిరఖని టేకింగ్ నచ్చే తనకు మరో ఛాన్స్ ఇస్తానని పవన్ అన్నట్టు వచ్చిన  న్యూస్ ఆల్రెడీ వైరల్ అయ్యింది